Andhra Pradesh: నాకు మా అన్నతో గొడవలేమీ లేవు...అందుకే తెలంగాణలో పార్టీ పెట్టా: వైఎస్ షర్మిల

  • తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల
  • జగన్ తో గొడవలుంటే ఏపీలోనే పార్టీ పెట్టుకోవాలని గతంలో కేటీఆర్ వ్యాఖ్యలు
  • కేటీఆర్ వ్యాఖ్యల్లో నిజం లేదని తేల్చేసిన షర్మిల
  • అత్త మీద కోపాన్ని తాను దుత్త మీద చూపడం లేదని వ్యాఖ్య
ys sharmila says no differences with his brother ys jagan mohan reddy

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఆయన సోదరి వైఎస్ షర్మిలకు గొడవలున్నాయని... అలాంటప్పుడు ఏపీలోనే పార్టీ పెట్టుకోవాలన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై తాజాగా వైఎస్ షర్మిల స్పందించారు. సోమవారం నాటి పాదయాత్రలో భాగంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన షర్మిల... తనకు తన సోదరుడితో ఎలాంటి గొడవలు లేవని తెలిపారు. తన సోదరుడితో తనకు గొడవలు ఉన్నాయని కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని ఆమె తేల్చిచెప్పారు.

ఈ సందర్భంగా తనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను షర్మిల ప్రస్తావించారు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు... సోదరుడితో గొడవలు ఉంటే ఏపీలో పార్టీ పెట్టుకోవాలని, అందుకు విరుద్ధంగా తెలంగాణలో పార్టీ ఎలా పెట్టుకుంటారని కేటీఆర్ అన్నట్లు షర్మిల చెప్పారు. కేటీఆర్ చెప్పిన సామెత నిజమేనని... అత్త మీద కోపాన్ని తాను దుత్త మీద చూపడం లేదన్నారు. తన సోదరుడితో తనకేమీ గొడవలు లేవన్నారు. అందుకే తాను ఏపీలో కాకుండా తెలంగాణలో పార్టీ పెట్టుకున్నానని ఆమె తెలిపారు.

More Telugu News