Andhra Pradesh: సుప్రీంకోర్టులో అమరావతి పిటిషన్లపై విచారణ మరోమారు వాయిదా

  • ఈ నెల 1న సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన అమరావతి పిటిషన్లు
  • నాట్ బిఫోర్ మీ అంటూ వేరే బెంచ్ కు సిఫారసు చేసిన సీజేఐ  
  • శుక్రవారం కోర్టు గడువు ముగుస్తున్నా విచారణకు రాని పిటిషన్లు
  • ధర్మాసనం ముందు అమరావతి రైతుల తరఫు న్యాయవాది ప్రస్తావన
  • ఈ పిటిషన్లపై ఈ నెల 14న విచారణ చేపట్టనున్నట్లు తెలిపిన కోర్టు
supreme court adjourns amaravati petitions hearing to 14th of this month

ఏపీ రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మరోమారు విచారణ వాయిదా పడింది. ఈ నెల 14న అమరావతి పిటిషన్లపై విచారణ చేపట్టనున్నట్లు శుక్రవారం సుప్రీంకోర్టు తెలిపింది. ఏపీ రాజధాని అమరావతేనని, దానిని నిర్ణీత కాల వ్యవధిలోగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ లో తమనూ ఇంప్లీడ్ చేసుకోవాలంటూ అమరావతి రైతులు మరో పిటిషన్ దాఖలు చేశారు. కొందరు వ్యక్తులు కూడా ఈ వ్యవహారంపై పిటిషన్లు దాఖలు చేశారు. ఈ అన్ని పిటిషన్లను కలిపి ఓకేసారి విచారణ చేపట్టనున్నట్లు గతంలోనే సుప్రీంకోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

వాస్తవానికి ఈ నెల 1న అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అయితే సీజేఐ జస్టిస్ లలిత్... నాట్ బిఫోర్ మీ అంటూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పిటిషన్లను మరో బెంచ్ కు బదిలీ చేయాలని, ఈ నెల 4న వాటిపై విచారణ చేపట్టాలని కూడా జస్టిస్ లలిత్ ఆదేశాలు జారీ చేశారు. 

అయితే ఈ పిటిషన్లు లిస్ట్ అయిన బెంచ్ వద్దకు వెళ్లిన అమరావతి రైతుల తరఫు న్యాయవాది వికాస్ సింగ్... బెంచ్ కార్యకలాపాలు ముగుస్తున్నా తమ పిటిషన్ విచారణకు రాని విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అమరావతి పిటిషన్లపై విచారణను ఈ నెల 14న చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.

More Telugu News