Nurul Hasan: కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్.. 5 పరుగుల పెనాల్టీ వేయాల్సిందే: బంగ్లాదేశ్

  • చేతుల్లో బాల్ లేకపోయినా థ్రో చేసిన విరాట్ కోహ్లీ
  • బంగ్లాదేశ్ ఇన్సింగ్స్ లో ఏడో ఓవర్లో చోటు చేసుకున్న దృశ్యం
  • ఫేక్ ఫీల్డింగ్ అంటూ నూరుల్ హసన్ అభ్యంతరం
Nurul Hasan accuses Virat Kohli of fake fielding during IND vs BAN clash Could have been a five run penalty

భారత్ చేతిలో ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైన బంగ్లాదేశ్ జట్టు.. కొత్త వివాదాన్ని లేవదీసింది. కోహ్లీ ఫీల్డింగ్ ను తప్పుబడుతూ.. అందుకు 5 పరుగుల జరిమానా విధించాలని డిమాండ్ చేసింది. తద్వారా ముగిసిపోయిన మ్యాచ్ ఫలితాన్ని మార్చాలనే ప్రయత్నంతో బంగ్లాదేశ్ జట్టు ఉన్నట్టు కనిపిస్తోంది. 

బుధవారం ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఓవల్ మైదానంలో బంగ్లాదేశ్, భారత్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. 20 ఓవర్లో భారత్ 184 పరుగులు సాధించింది. వరుణుడు అడ్డుపడడంతో బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 16 ఓవర్లలో 151 పరుగులకు కుదించారు. ఏడో ఓవర్లో షాట్ రూపంలో తన వైపు బంతి రాగా, దాన్ని అర్షదీప్ సింగ్ పట్టుకుని వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ వైపు విసిరాడు. సరిగ్గా వీరి మధ్యలో ఉన్న విరాట్ కోహ్లీ కూడా అర్షదీప్ విసిరిన బంతిని తాను పట్టుకుని విసిరేసినట్టు చేతులను థ్రో చేశాడు. దీంతో బంగ్లాదేశ్ వికెట్ కీపర్, బ్యాటర్ అయిన నూరుల్ హసన్ తప్పు బట్టాడు.

‘‘మైదానం తడిగా ఉంది. కనుక దీని ప్రభావం ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీన్ని చూశారు. బాల్ చేతుల్లో లేకపోయినా నకిలీ థ్రో చేసినందుకు ఐదు పరుగుల పెనాల్టీ విధించాలన్నది నా ఉద్దేశ్యం’’ అని నూరుల్ హసన్ పేర్కొన్నాడు. దీనిపై నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఈ విషయాన్ని అప్పుడే చెప్పొచ్చుగా..? అని కొందరు కామెంట్లు పెట్టారు. బాల్ ను ఎలా థ్రో చేయాలో చూపిస్తున్నాడయ్యా.. అని కొందరు స్పందించారు. అప్పుడే చెప్పి ఉంటే అంపైర్లు తమ నిర్ణయం ప్రకటించేవారుగా.. అని కొందరు దీనిపై కామెంట్ పెట్టారు. నిజానికి ఈ మొత్తాన్ని ఫీల్డ్ అంపైర్ పరిశీలిస్తూనే ఉన్నాడు. తప్పు అయితే చర్యలు ప్రకటించి ఉండేవారు.

More Telugu News