Bonda Uma: వివేకా హత్య విషయం సీఎం జగన్ కు ముందే తెలుసని రుజువైంది: బొండా ఉమ

  • టీడీపీ కేంద్ర కార్యాలయంలో బొండా ఉమ ప్రెస్ మీట్
  • వివేకా హత్య నేపథ్యంలో సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు
  • నైతిక బాధ్యతగా జగన్ రాజీనామా చేయాలని డిమాండ్
Bonda Uma press meet

వివేకా హత్యకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహించి సీఎం పదవికి రాజీనామా చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. హత్యతో తనకు సంబంధం లేదని భావిస్తే, జగన్ రెడ్డి ఇప్పటికైనా వివేకా హంతకులను అరెస్టు చేయించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కడప ఎంపీ టికెట్ వైఎస్ కుటుంబంలోనే ఉండాలని వివేకా పట్టుబట్టినందుకు భారతీరెడ్డి కుటుంబ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, తదితరులు పక్కా ప్రణాళికతో గొడ్డలితో దారుణంగా నరికి చంపారని సీబీఐ అఫిడవిట్ తో స్పష్టంగా తెలుస్తోందన్నారు. 

వివేకా హత్య కేసును సీబీఐ విచారించాలని  ప్రతిపక్షంలో ఉండగా హైకోర్టును కోరిన జగన్... అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు ఉపసంహరించుకున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి, కొంత మంది అదృశ్య శక్తులు కేసును ప్రభావితం చేస్తున్నారని సీబీఐ అఫిడవిట్ లో పేర్కొందని తెలిపారు. ఇదే అవినాష్ రెడ్డిని జగన్ అసెంబ్లీ సాక్షిగా వెనకేసుకురావడం దేనికి నిదర్శనమో జగన్ సమాధానం చెప్పాలని కోరారు. 

"వివేకా హత్య జరిగిన రోజు విజయసాయిరెడ్డి, అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు మాట్లాడిన మాటలు పొంతన లేకుండా ఉన్నాయి. దీన్ని బట్టి హత్య విషయం జగన్ కు ముందే తెలుసని రుజువవుతుంది. జగన్ సొంతచెల్లి షర్మిల ఢిల్లీలో మాట్లాడుతూ కడప ఎంపీ సీటు నేపథ్యంలోనే వివేకా హత్య  జరిగిందని బాహాటంగా మీడియా ముందు చెప్పింది. దీనిపై ఇప్పటి వరకు జగన్ నోరెందుకు విప్పలేదు. సొంత బాబాయ్ హత్య కేసును తేల్చలేక కేసును వేరే రాష్ట్రానికి బదిలీ అయ్యేలా వ్యవహరించిన చేతకాని ముఖ్యమంత్రి.... సామాన్యులకు ఏం న్యాయం చేస్తాడు?" అని బొండా ఉమ విమర్శించారు. 

"ప్రతిపక్ష కార్యకర్తలు సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులను ఫార్వార్డ్ చేస్తే అర్థరాత్రి గోడలు దూకి అరెస్టు చేసే సీఐడీ...వివేకా హత్య కేసు విషయంలో ఎందుకు మౌనం పాటించిందో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ సమాధానం చెప్పాలి. ప్రస్తుత డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి వివేకా హత్య కేసు వైపు కనీసం తొంగిచూడలేదంటే... హత్య వెనుక ఏ హస్తం ఉందో ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరిని చంపడానికి చూస్తున్నది ఎవరో సీఎం నోరు విప్పాలి. తనకు ప్రాణహాని ఉందని మొత్తుకుంటున్న దస్తగిరి భద్రత ప్రశ్నార్థకంగా మారిందని సీబీఐ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ పై జగన్ సమాధానం చెప్పాలి" అని బొండా ఉమ డిమాండ్ చేశారు. 

వివేకా హత్య కోసం హంతకులకు రూ.50 కోట్ల సుపారీ, అడ్వాన్స్ రూ .5కోట్లు ఇచ్చింది భారతీరెడ్డి కుటుంబం కాదా జగన్ రెడ్డి? అని బొండా ఉమ ప్రశ్నించారు. వివేకా హత్యకు సంబంధించిన ప్రతి విషయం జగన్ రెడ్డికి సంబంధం ఉందని తేల్చిచెప్పారు. సీబీఐ తక్షణమే ఈ కేసును విచారణ చేసి హత్యకు సహకరించిన వారిని, హంతకులకు అండగా నిలబడిన వారిని, సాక్ష్యులను చంపాలని చూసిన వారిని, హత్యతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ కటకటాల వెనక్కి పంపాలని టీడీపీ కోరుకుంటోందన్నారు.  

వివేకా హత్య కేసు వేరొక రాష్ట్రానికి బదిలీ చేయాలని వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించడం రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం జగన్ రెడ్డికి సిగ్గుచేటుగా భావించాలని బొండా ఉమ అన్నారు. జగన్ ను సీబీఐ అరెస్టు చేయడానికి ముందే హత్యకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేసి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News