Kotla Vijayabhaskar Reddy: కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు సిద్ధప్ప దారుణ హత్య

  • కోడుమూరులో సిద్ధప్పను నరికి చంపిన ప్రత్యర్థులు
  • కప్పట్రాళ్ల హత్యతో పాటు మరో మూడు హత్యల్లో నిందితుడైన సిద్ధప్ప
  • కొంతకాలంగా కోడుమూరులో తలదాచుకుంటున్న సిద్ధప్ప
Kotla Vijayabhaskar Reddy follower murdered

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ భూతం మరోసారి పడగవిప్పింది. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు సిద్ధప్పను ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. కోడుమూరులో ఆయన తన అనుచరులతో కలిసి ఉండగా ప్రత్యర్థులు దాడిచేసి వేట కొడవళ్లతో నరికి చంపారు. ఒక పక్కా ప్లాన్ తోనే ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

సిద్ధప్పది గోనెగండ్ల మండలం కున్నూరు గ్రామం. 2008లో దారుణహత్యకు గురైన కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసుతో పాటు మరో మూడు హత్యల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. కొంత కాలంగా కున్నూరును విడిచి కోడుమూరులో తలదాచుకుంటున్నారు. ఆయన కదలికను పసిగట్టిన ప్రత్యర్థులు పక్కా ప్లాన్ తో దాడి చేసి, హతమార్చారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ హత్యతో కోడుమూరులో భయాందోళనలు నెలకొన్నాయి.

More Telugu News