TRS: గతంలో చిరంజీవి వచ్చారు.. ఇప్పుడు పవన్ వస్తారేమో!: తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్

  • సీఎం అయ్యే అన్ని అర్హతలు కేటీఆర్ కు ఉన్నాయన్న మంత్రి
  • బూర నర్సయ్య బీజేపీలోకి వెళ్లడం ఆయన వ్యక్తిగతం అని వ్యాఖ్య
  • ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చన్న శ్రీనివాస్ గౌడ్
KTR will be next CM says minister srinivas goud

తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తర్వాత రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి అయ్యేది ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ మాత్రమే అని వ్యాఖ్యానించారు. అందులో సందేహం లేదన్నారు. సీఎం పదవి చేపట్టేందుకు అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి కేటీఆర్ అని చెప్పారు. భవిష్యత్ నాయకుడు కేటీఆర్ అని కీర్తించారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లోని టీఆర్ఎస్ఎల్పీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. 

బూర నర్సయ్య గౌడ్ బీజేపీకి వెళ్లడం ఆయన వ్యక్తిగతం అని మంత్రి చెప్పారు. మతం పేరుతో బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోందని ఆరోపించారు. బీజేపీ డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసి మునుగోడులో గెలవాలని చూస్తోందని విమర్శించారు. మొన్న నియోజకవర్గంలో పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడటమే ఇందుకు నిదర్శనం అన్నారు. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తారన్న వార్తలపై శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చని అన్నారు. గతంలో చిరంజీవి వచ్చారు..ఇప్పుడు పవన్ వస్తారేమో అని కామెంట్ చేశారు.

More Telugu News