కన్నతల్లికి అన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నట్టుంది: హరీశ్ రావు

Harish Rao election campaign in Munugode
  • రాజుపేట గ్రామంలో ప్రచారాన్ని నిర్వహించిన హరీశ్ రావు
  • బీజేపీని చిత్తుగా ఓడించాలన్న హరీశ్
  • రాజగోపాల్ రెడ్డి స్వార్థంతోనే ఉప ఎన్నిక వచ్చిందని విమర్శ
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని చిత్తుగా ఓడించాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వార్థంతోనే ఉప ఎన్నిక వచ్చిందని చెప్పారు. డబ్బు, మద్యంతో గెలవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో మునుగోడు నుంచి గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కరోజైనా ఈ గ్రామానికి వచ్చారా? అని ప్రశ్నించారు. మర్రిగూడెం మండలం రాజుపేట గ్రామస్తులతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఏనాడూ కనపడని రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకుందామా? లేక అభివృద్ధి చేసే టీఆర్ఎస్ ను గెలిపించుకుందామా? అని హరీశ్ ప్రశ్నించారు. ఆగం కాకుండా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని... ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. 

బీజేపీ గెలిస్తే రూ. 3 వేల పెన్షన్ ఇస్తామని ప్రచారం చేసుకుంటున్నారని... ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోనే రూ. 700 పెన్షన్ ఇస్తున్నారని... అలాంటప్పుడు తెలంగాణలో రూ. 3 వేల పెన్షన్ ఎలా ఇస్తారని ఎద్దేవా చేశారు. కన్నతల్లికి అన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానట్టుగా వీరి వ్యవహారశైలి ఉందని విమర్శించారు.
Go Back to Shorts
Harish Rao
TRS
Komatireddy Raj Gopal Reddy
BJP
Munugode

More Telugu News