Nigeria: నైజీరియాను కుదిపేస్తున్న వర్షాలు.. 600 మంది మృత్యువాత

Nigeria Floods Kill Hundreds and Displace Over a Million people
  • గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షాలు
  • నిరాశ్రయులుగా మారిన 13 లక్షల మంది
  • వచ్చే నెలాఖరు వరకు కొనసాగనున్న వర్షాలు
ఆఫ్రికన్ దేశం నైజీరియాను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న వర్షాలతో దేశం అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా ఏకంగా 600 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లు కొట్టుకుపోవడం, ఇళ్లు మునిగిపోవడం కారణంగా 13 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భారీ ఆస్తి నష్టం సంభవించింది. పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లకపోవడంతోనే ప్రాణనష్టం ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు.

వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉండడంతో ప్రజలు ఇప్పటికైనా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని నైజీరియా మంత్రి సదియా ఉమర్ ఫరూఖ్ కోరారు. ప్రమాదం ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల ఇళ్లు కొట్టుకుపోయి ఉంటాయని అంచనా వేస్తున్నారు. కాగా, వచ్చే నెలాఖరు వరకు వర్షాలు, వరదలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Nigeria
Nigeria Floods
Floods
Heavy Rains

More Telugu News