Hundred Crores: జోగులాంబ ఆలయ హుండీలో రూ.100 కోట్ల చెక్కు కలకలం.... అధికారులు ఆరా తీస్తే...!

Hundred crores cheque spotted in Jogulamba temple hundi
  • హుండీలో బ్యాంక్ చెక్కును గుర్తించిన ఆలయ అధికారులు
  • అక్షరాలా వంద కోట్ల రూపాయలు అని రాసి ఉన్న వైనం
  • మతిస్థిమితం లేని వ్యక్తి పనిగా గుర్తింపు
  • అతడి ఖాతాలో రూ.23 వేలు ఉన్నట్టు వెల్లడి
  • ఆ వ్యక్తిని ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించిన పోలీసులు

తెలంగాణలోని ఆలంపూర్ లో కొలువైన జోగులాంబ అమ్మవారి ఆలయం ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఇక్కడికి కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. కాగా, జోగులాంబ అమ్మవారి ఆలయ హుండీలో నగదు లెక్కిస్తున్న అధికారులు రూ.100 కోట్ల చెక్కును చూసి అదిరిపడ్డారు. ఆలయ చరిత్రలో అంత పెద్ద మొత్తం హుండీ ద్వారా ఎప్పుడూ లభించలేదు. 

ఆ చెక్కుపై 'అక్షరాలా వంద కోట్ల రూపాయలు' అని రాసి ఉంది. అయితే ఆ చెక్కు నిజమైనదేనా అని అనుమానం వచ్చిన ఆలయ అధికారులు ఆరా తీస్తే ఆసక్తికర సంగతులు వెల్లడయ్యాయి. ఆ చెక్కు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు వరంగల్ బ్రాంచికి చెందినదని తెలిసింది. 

ఆ చెక్కును హుండీలో వేసిన వ్యక్తి ఆలంపూర్ మండలానికి చెందినవాడే. అయితే అతడికి మతిస్థిమితం లేదని గుర్తించారు. ఇక, వంద కోట్లు అని రాసిన ఆ వ్యక్తి బ్యాంకు అకౌంట్లో ఉన్నది కేవలం రూ.23 వేలేనట. అతడు తన చెక్కుపై 'ఆర్మీ జవాన్ల కోసం' అని రాసి ఉన్నట్టు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. 

కాగా, ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి రీత్యా పోలీసులు అతడిని హైదరాబాదులోని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చేర్పించినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News