Charlapalli: నగ్న వీడియోల పేరుతో చర్లపల్లి జైలు ఉన్నతాధికారిని నిండా ముంచిన సైబర్ నేరగాళ్లు

  • చర్లపల్లి  జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌కు సైబర్ నేరగాళ్ల బురిడీ
  • తొలుత అమ్మాయిలతో నగ్నంగా మాట్లాడించిన కేటుగాళ్లు
  • నగ్న వీడియోలపై యూట్యూబ్ నుంచి ఫిర్యాదు అందిందంటూ సీబీఐ అధికారి పేరుతో ఫోన్
  • రూ. 97,500 సమర్పించుకున్న అధికారి
  • పశ్చిమ బెంగాల్‌ నుంచి కాల్ చేసినట్టు గుర్తించిన పోలీసులు
Charlapalli jail Official Cheated by Cyber Criminals

సైబర్ నేరగాళ్ల బారినపడి చర్లపల్లి జైలు ఉన్నతాధికారి ఒకరు దాదాపు లక్ష రూపాయలు సమర్పించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న ఒక అధికారికి  ఇటీవల ఫోన్ చేసిన కొందరు యువతులు ఆయనతో చాటింగ్ చేశారు. ఆ తర్వాత నగ్నంగా వీడియో కాల్‌లో  మాట్లాడారు. ఆయనతోనూ అలాగే మాట్లాడించారు. దానిని రికార్డు చేసిన నేరగాళ్లు ఆ తర్వాత అసలు రూపం బయటపెట్టారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. వారి బెదిరింపులను ఆయన పట్టించుకోలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు సీబీఐ అధికారి అజయ్ కుమార్ పాండే పేరుతో జైలు అధికారికి ఫోన్ చేసి.. మీ అసభ్య వీడియోపై యూట్యూబ్ నుంచి ఫిర్యాదు అందిందని, తనకు డబ్బులు చెల్లిస్తే మేనేజ్ చేసుకుంటానని నమ్మించాడు. అంతేకాదు, సీబీఐ పేరుతో నకిలీ లేఖ కూడా పంపాడు.

రాహుల్ శర్మ అనే వ్యక్తి నంబరు ఇచ్చి ఆయనకు ఫోన్ చేసి సెటిల్ చేసుకోవాలని సూచించాడు. ఆయన ఇచ్చిన నంబరుకు జైలు అధికారి ఫోన్ చేశారు. యూట్యూబ్ నుంచి వీడియోలు తొలగించేందుకు రెండు విడతలుగా రూ. 97,500 చెల్లించుకున్నారు. ఆ తర్వాత కూడా మరోమారు ఫోన్ చేసి మరో రెండు వీడియోలు ఉన్నాయని, వాటిని వైరల్ చేయకుండా ఉండాలంటే రూ.85 వేలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో అయోమయంలో పడిన  అధికారిని  గమనించిన తోటి ఉద్యోగి విషయం ఆరా తీశారు. అది విని ఇది సైబర్ మోసం తప్ప మరోటి కాదని ఆయనకు చెప్పారు. దీంతో ఆయన కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

More Telugu News