Rhino: లారీని ఢీకొట్టిన రైనో సేఫ్​.. వీడియో విడుదల చేసిన అసోం సీఎం

  • పరుగెత్తుకొచ్చి లారీని ఢీకొట్టిన రైనో.. గాయపడినట్టుగా గుర్తింపు
  • అసోం కజిరంగ నేషనల్ పార్క్ లోని ఘటన వీడియోను షేర్ చేసిన ఆ రాష్ట్ర సీఎం 
  • అలాంటివి జరగకుండా చూడాలని వాహనదారులకు విజ్ఞప్తి
  • సదరు రైనో కోసం డ్రోన్లతో గాలింపు.. బాగానే ఉందని తాజాగా గుర్తింపు
The Rhino is safe who hits truck in assam

అసోంలోని కజిరంగ నేషనల్ పార్కులో వేగంగా వస్తున్న లారీని రైనో ఢీకొట్టడం, ఆ తర్వాత రెండు సార్లు కిందపడిపోవడంతో గాయపడినట్టుగా భావించడం తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను అసోం సీఎం హిమంత బిశ్వశర్మ షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ రైనో పరిస్థితి ఏమిటో అని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేయడంతో.. అసోం కజిరంగ నేషనల్ పార్కు అధికారులు.. డ్రోన్ల సాయంతో పరిశీలన చేపట్టారు. ఈ క్రమంలో సదరు రైనోను ఓ నీటి గుంట ఉన్న ప్రాంతంలో గుర్తించారు.

ఫర్వాలేదు.. బాగానే ఉంది..
రైనోను డ్రోన్ సాయంతో పరిశీలించిన అధికారులు.. అది బాగానే ఉందని గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియోను అసోం సీఎం హిమంత బిశ్వశర్మ తాజాగా ట్వీట్ చేశారు. ‘‘హల్దీబరి ప్రాంతంలో ట్రాక్కును ఢీకొట్టి ప్రమాదానికి గురైన మన రైనో బాగానే ఉన్నట్టు గుర్తించారు. దీనికి సంబంధించిన డ్రోన్ వీడియోను షేర్ చేస్తున్నా. జంతువుల పట్ల అందరూ దయతో వ్యవహరించాలని కోరుతున్నాను. వన్య ప్రాణులున్న ప్రాంతాల మీదుగా వెళ్లే వాహనదారులు.. మెల్లగా ప్రయాణించాలి. అక్కడక్కడా జంతువులు రోడ్డు దాటుతూ ఉంటాయి. వాటిని గమనించాలి..” అని హిమంత విజ్ఞప్తి చేశారు.

అసలేం జరిగింది?
ఇటీవల అసోంలోని కజిరంగ నేషనల్ పార్కులో రోడ్డు పక్కనే నిలబడి ఉన్న భారీ రైనో.. వేగంగా వస్తున్న లారీని చూసి బెదిరింది. ఆ లారీని జంతువని భావించి తలతో ఢీకొట్టింది. అయితే లారీ పక్క భాగంలోని ఉక్కు ప్లేట్లకు తగలడంతో రైనోకు కాస్త బలంగానే దెబ్బతగిలి కింద పడిపోయింది. లారీ వెళ్లిపోయాక లేచి నిలబడి, మళ్లీ పడిపోయింది. తిరిగి లేచి అడవి లోపలికి వెళ్లిపోయింది. రైనోకు బలంగానే గాయమై ఉంటుందన్న ఆందోళనతో డ్రోన్ తో పరిశీలన జరిపారు. ఆ రైనో బాగానే ఉన్నట్టు గుర్తించారు. 

  • ఈ రెండో వీడియోకు కూడా లక్షా 90 వేలకుపైగానే వ్యూస్ వచ్చాయి. ‘‘రైనో బాగానే ఉందన్న సమాచారం సంతోషంగా ఉంది. మంచి పని చేశారు సర్..” అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
  • ‘ఇప్పటికైనా కజిరంగ నేషనల్ పార్క్ లోని రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు పెట్టించండి’, ‘వాహన దారులకు అవగాహన కల్పించే ఏర్పాట్లు చేయండి’ అంటూ సూచనలూ చేస్తున్నారు.
 

More Telugu News