Telangana: చ‌నిపోయేదాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా: ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

  • పార్టీని వీడ‌న‌ని సోనియాకు మాట ఇచ్చాన‌న్న వెంక‌ట్ రెడ్డి
  • తాను పార్టీ ప‌ద‌విని మాత్ర‌మే ఆశించాన‌ని వెల్ల‌డి
  • మంత్రి, ముఖ్య‌మంత్రి ప‌ద‌వులు త‌న‌కు అవ‌స‌రం లేద‌న్న ఎంపీ
komatireddy venkat reddy says he will continue in congress till death

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి గురువారం త‌న రాజ‌కీయ ప్ర‌స్థానంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గుండాల‌లో జ‌రిగిన పార్టీ కార్య‌కర్త‌ల స‌మావేశంలో మాట్లాడిన ఆయ‌న తాను చ‌నిపోయేదాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు తాను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి మాట ఇచ్చాన‌ని కూడా ఆయ‌న చెప్పారు. తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ప్ర‌క‌టించే స‌మ‌యంలో సోనియా గాంధీతో తాను జ‌రిపిన సంభాష‌ణ‌ను కోమ‌టిరెడ్డి ప్ర‌స్తావించారు. 

తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నామ‌ని, మీరంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉండాల‌ని త‌మ‌ను సోనియా గాంధీ కోరార‌ని వెంక‌ట్ రెడ్డి చెప్పారు. ఆ మాట‌కు ప్ర‌తిగా తాను చ‌నిపోయే దాకా కాంగ్రెస్ పార్టీని వీడ‌బోన‌ని సోనియాకు మాట ఇచ్చాన‌ని ఆయ‌న చెప్పారు. కాంగ్రెస్ అంటే కోమ‌టిరెడ్డి అన్న ఆయ‌న‌... కోమ‌టిరెడ్డి అంటే కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. తాను పార్టీ ప‌ద‌విని మాత్ర‌మే ఆశించాన‌న్న వెంక‌ట్ రెడ్డి... మంత్రి, ముఖ్య‌మంత్రి ప‌ద‌వులు త‌న‌కు అవ‌స‌రం లేద‌ని చెప్పారు.

More Telugu News