RSS: దేశంలో జనాభా నియంత్రణ అవసరం లేదు.. ఆర్​ఎస్​ఎస్​ కు అసదుద్దీన్​ ఓవైసీ కౌంటర్​

  • దేశంలో అన్ని మతాలు, వర్గాలకు వర్తించేలా జనాభా నియంత్రణ విధానం ఉండాలన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
  • ఇప్పటికే దేశంలో జనాభా నియంత్రణ మంచి స్థాయిలో ఉందన్న అసదుద్దీన్
  • ముస్లింలలోనూ జనాభా పెరుగుదల రేటు బాగా తగ్గిందని వెల్లడి
 No need for population control says asaduddin owaisi on RSS chief mohan bhagwats remarks

దేశంలో జనాభా నియంత్రణ కోసం ప్రత్యేకమైన విధానం ఉండాలని, అది అన్నివర్గాలు, మతాలకు సమానంగా వర్తించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. మన దేశంలో ప్రస్తుతం జనాభా నియంత్రణ పాలసీలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

జనాభా ఇప్పటికే నియంత్రణలోకి వస్తోంది
‘‘ముస్లింలు, హిందువుల డీఎన్ఏ ఒకటే అయినప్పుడు ఈ అసమానతలు ఎందుకు. మన దేశంలో ఇప్పటికే జనాభా రీప్లేస్ మెంట్ విషయంలో  కనీస స్థాయికి చేరుకున్నందువల్ల కొత్తగా జనాభా నియంత్రణ విధానాలేమీ అవసరం లేదు. ఇప్పుడు సమస్య ఏమిటంటే వృద్ధుల జనాభా పెరుగుతోంది. నిరుద్యోగ యువత ఆ వృద్ధులను సరిగా చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ముస్లింలలో అయితే జనాభా పెరుగుదల బాగా వేగంగా తగ్గిపోతోంది కూడా..” అని అసదుద్దీన్ పేర్కొన్నారు.

మోహన్ భగవత్ ఏమన్నారు?
బుధవారం మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన ఆర్ఎస్ఎస్ దసరా ర్యాలీలో మోహన్ భగవత్ మాట్లాడుతూ.. దేశంలో అన్ని మతాలు, వర్గాలకు వర్తించేలా జనాభా నియంత్రణ విధానం ఉండాలని వ్యాఖ్యానించారు. మతాలు, వర్గాల పరంగా జనాభా పెరుగుదల రేటు వేర్వేరుగా ఉండటం సరికాదని పేర్కొన్నారు. దీనిపైనే అసదుద్దీన్ కౌంటర్ ఇచ్చారు.

More Telugu News