Etela Rajender: కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తానన్నట్టుగా ఉంది: ఈటల రాజేందర్

  • కేసీఆర్ జాతీయ స్థాయికి పోయి చేసేదేముందన్న ఈటల
  • తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేశారని మండిపాటు
  • ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని డిమాండ్
Etela Rajender fires on KCR

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి విమర్శలు గుప్పించారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న కేసీఆర్ ను ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ వ్యవహారశైలి చూస్తుంటే... కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తానన్నట్టుగా ఉందని అన్నారు. 

ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేశారని... ఈయన జాతీయ స్థాయికి వెళ్లి చేసేదేముందని ప్రశ్నించారు. తెలంగాణను అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా కేసీఆర్ మార్చారని దుయ్యబట్టారు. దేశంలో, రాష్ట్రంలో కేసీఆర్ ఒక చెల్లని రూపాయిగా మారిపోయారని అన్నారు. చౌటుప్పల్ లో చాకలి ఐలమ్మ విగ్రహానికి ఈరోజు ఈటల పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం స్థానిక బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని ఈటల ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అమరవీరుల స్తూపం నిర్మాణాన్ని పూర్తి చేయాలని అన్నారు. అమర వీరుల కుటుంబాలను ఆదుకుంటామని ఇచ్చిన హామీలను కేసీఆర్ ఇంతవరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేశారని అన్నారు.

More Telugu News