BJP: కేసీఆర్ క‌ల నెర‌వేర‌దు.. అసోం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ

  • మ‌రో 30 ఏళ్ల దాకా కేంద్రంలో బీజేపీ స‌ర్కారేన‌న్న హిమంత బిశ్వ శ‌ర్మ‌
  • సూర్యుడి మీదో, చంద్రుడి మీదో, స‌ముద్రంలోనో కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకోవ‌చ్చ‌ని సెటైర్‌
  • తెలంగాణ ప్ర‌జ‌ల విశ్వాసాన్ని కేసీఆర్ కోల్పోయార‌న్న అసోం సీఎం
assam cm Himanta Biswa Sarma viral comments on kcr national politics

తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన అసోం ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వ శ‌ర్మ... టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్ నెర‌పుతున్న రాజ‌కీయాల‌పై శుక్ర‌వారం కీలక వ్యాఖ్య‌లు చేశారు. మ‌రో 30 ఏళ్ల దాకా కేంద్రంలో బీజేపీ స‌ర్కారే ఉంటుంద‌న్న ఆయ‌న‌... కేంద్రంలో విప‌క్షాల‌తో క‌లిసి ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల‌న్న కేసీఆర్ క‌ల నెర‌వేర‌ద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. 

సూర్యుడి మీదో, చంద్రుడి మీదో... లేదంటే స‌ముద్రంలోనో కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల‌న్న శ‌ర్మ‌... కేంద్రంలో అయితే కేసీఆర్ ప్ర‌భుత్వం ఏర్పాటు కావ‌డానికి అవ‌కాశ‌మే లేద‌ని అన్నారు. ప్ర‌స్తుతం దేశంలోని ప్ర‌తిప‌క్షాల‌న్నీ క‌లిసే ఉన్నాయ‌ని, ఆ ప‌నిని కొత్త‌గా కేసీఆర్ చేయాల్సిందేమీ లేద‌ని అన్నారు.

తెలంగాణ‌లో కేసీఆర్ ప్ర‌జ‌ల విశ్వాసాన్ని కోల్పోయార‌ని చెప్పిన శ‌ర్మ‌.. ఈ విష‌యాన్ని గ్ర‌హించిన త‌ర్వాతే కేసీఆర్ జాతీయ రాజ‌కీయాలంటూ తిరుగుతున్నార‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను కేసీఆర్ అమ‌లు చేయాల‌ని, లేదంటే ఆయ‌న ఎక్క‌డ తిరిగినా గౌర‌వం ల‌భించ‌ద‌ని కూడా శ‌ర్మ అన్నారు. సీబీఐ, ఈడీల గురించి మాట్లాడేవారికి అవి అంటే భ‌య‌ముంద‌ని శ‌ర్మ‌ అన్నారు.

More Telugu News