Sri Lanka: భారత్ ఆందోళనలను బేఖాతరు చేస్తూ చైనా నౌకకు అనుమతి ఇచ్చిన శ్రీలంక

  • హంబన్ టోట పోర్టుకు వస్తున్న చైనా నౌక
  • అది నిఘా నౌక అని భారత్ ఆందోళన
  • అనుమతి ఇవ్వొద్దని శ్రీలంకకు విజ్ఞప్తి
  • భారత్ సరైన కారణాలు చెప్పడంలో విఫలమైందన్న శ్రీలంక
Sri Lanka grants permission to China ship to dock in Humbantota port

చైనా నౌక యువాన్ వాంగ్-5 శ్రీలంకలోని హంబన్ టోట పోర్టుకు వస్తుండడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండడం తెలిసిందే. అది సర్వేనౌక మాత్రమే కాకుండా, దాంట్లో నిఘా వేసేందుకు అత్యాధునిక పరికరాలు ఉన్నాయని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆ చైనా నౌకకు అనుమతి ఇవ్వరాదని శ్రీలంక ప్రభుత్వాన్ని కోరింది. అయితే, భారత్ విజ్ఞప్తిని పట్టించుకోకుండా శ్రీలంక ప్రభుత్వం హంబన్ టోట పోర్టులో లంగరు వేసేందుకు చైనా నౌక యువాన్ వాంగ్-5కి అనుమతి ఇచ్చింది. 

దీనిపై శ్రీలంక ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. భారత్ తన ఆందోళనలను ప్రధాని రణిల్ విక్రమసింఘేకు తెలియజేసిందని, అయితే, ఆ నౌకను ఎందుకు అనుమతించకూడదో సరైన కారణాలు చెప్పడంలో భారత్ విఫలమైందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టు 16 నాటికి యువాన్ వాంగ్-5 నౌక హంబన్ టోట పోర్టుకు రానున్నట్టు చైనా దౌత్యకార్యాలయం నుంచి సమాచారం అందిందని శ్రీలంక విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

More Telugu News