sanat jayasuriya: సనత్ జయసూర్యకు కీలక బాధ్యతలను అప్పజెప్పిన శ్రీలంక ప్రభుత్వం

  • టూరిజం శాఖ ప్రచారకర్తగా జయసూర్యకు బాధ్యతలు
  • శ్రీలంకలో భారత రాయబారితో చర్చలు జరిపిన జయసూర్య
  • టూరిజం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించిన వైనం
Sri Lanka government appoints Sanat Jayasuriya as tourism brand ambassador

ఆర్థిక, ఇంధన, ఔషధ సంక్షోభంతో శ్రీలంక అట్టుడుకుతోంది. నూతన అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన రణిల్ విక్రమ సింఘే పరిస్థితిని చక్కదిద్దేందుకు అడుగులు వేస్తున్నారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం అత్యంత కీలకమనే విషయం తెలిసిందే. ఆ దేశ జీడీపీలో టూరిజం వాటా దాదాపు 12 శాతంగా ఉంది. 

ఈ నేపథ్యంలో, ఆర్థిక వ్యవస్థను మెరుగు పరుచుకోవడానికి పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్యకు కీలక బాధ్యతలను అప్పజెప్పింది. టూరిజం శాఖ ప్రచారకర్తగా నియమించింది. 

పర్యాటకశాఖ ప్రచారకర్తగా జయసూర్య బాధ్యతలను స్వీకరించారు. అనంతరం శ్రీలంకలో భారత రాయబారి గోపాల్ బాగ్లేని ఆయన కలిశారు. దేశంలో టూరిజం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. శ్రీలంకలో ఉన్న హిందూ ఆలయాలు, హిందూ పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తామని, వాటికి ప్రాచుర్యం కల్పిస్తామని గోపాల్ బాగ్లేకి హామీ ఇచ్చారు. రామాయణానికి సంబంధించి శ్రీలంకలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్న సంగతి తెలిసిందే.

More Telugu News