AP High Court: తలాక్‌పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. వరుసగా మూడుసార్లు తలాక్ చెబితే కుదరదని స్పష్టీకరణ

  • తలాక్‌నామా రాసుకున్నా చెల్లదన్న హైకోర్టు
  • ముస్లిం మహిళ మళ్లీ వివాహం చేసుకోనంత వరకు భృతికి అర్హురాలేనన్న ధర్మాసనం
  • గుంటూరు కోర్టు తీర్పును కొట్టేసిన న్యాయస్థానం
AP High Court key verdict on talak

భర్త నుంచి జీవన భృతి కోరుతూ కోర్టుకెక్కిన ముస్లిం మహిళకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ క్రమంలో గత తీర్పును కొట్టేసిన న్యాయస్థానం.. తలాక్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. షరియత్ చట్ట నిబంధలనకు వ్యతిరేకంగా ఏకవాక్యంలో మూడుసార్లు తలాక్ చెప్పడానికి వీల్లేనప్పుడు దానిని తలాక్ రూపంలో రాసుకున్నా చెల్లదని స్పష్టం చేసింది. అలా రాసే తలక్‌నామాతో వివాహాన్ని రద్దయినట్టుగా పరిగణించలేమని పేర్కొంది. భార్యాభర్తల మధ్య సయోధ్య కుదరనప్పుడు మూడు వేర్వేరు సందర్భాల్లో తలాక్ చెప్పాల్సి ఉంటుందని, ఆ మూడు సందర్భాల మధ్య కూడా అవసరమైన దూరం ఉండాలని వివరించింది. 

అంతేకాదు, తలాక్ చెప్పిన విషయాన్ని ఆ భర్త తన భార్యకు చెప్పాల్సి ఉంటుందని పేర్కొంది. ఒకేసారి మూడుసార్లు తలాక్‌లు చెప్పి వివాహం రద్దయిందని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని ‘షయారా బానో’ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేసింది. కాబట్టి ఆమెను అతడి భార్యగానే గుర్తించాలని, భరణానికి ఆమె అర్హురాలేనని స్పష్టం చేసింది. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ మళ్లీ పెళ్లి చేసుకోనంత వరకు భర్త నుంచి భరణం పొందేందుకు అర్హురాలేనని పేర్కొంటూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి తీర్పు చెప్పారు.

ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. పి.గౌస్‌బీ అనే మహిళ తన భర్త నుంచి నెలకు రూ. 2 వేల జీవనభృతి కోరుతూ 2004లో పొన్నూరు జ్యుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. తాను రిజిస్టర్‌ పోస్టు ద్వారా పంపిన తలాక్‌నామాను ఆమె తిరస్కరించారని, కాబట్టి ఆమె జీవనభృతికి అనర్హురాలని ఆమె భర్త జాన్ సైదా కోర్టులో వాదించారు. ఈ వాదనను తోసిపుచ్చిన కోర్టు పిటిషనర్‌కు, ఆమె కుమారుడికి నెలకు రూ. 800 చొప్పున భరణం చెల్లించాలని ఆదేశించింది. 

ఈ తీర్పును సైదా గుంటూరులోని మొదటి అదనపు సెషన్స్ కోర్టులో సవాలు చేయగా, భార్యకు భరణం చెల్లించాల్సిన పనిలేదని, కుమారుడికి మాత్రం చెల్లించాలని తీర్పు చెప్పింది. దీంతో 2006లో గౌస్‌బీ హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా తీర్పు వెలువరించింది. గుంటూరు కోర్టు తీర్పును రద్దు చేస్తూ పొన్నూరు కోర్టు తీర్పును సమర్థించింది. అలాగే, ఆ కోర్టు ఇచ్చిన తీర్పు 16 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో కోర్టును ఆశ్రయించి, జీవనభృతిని పెంచాలని కోరే స్వేచ్ఛ కూడా ఆమెకు ఉందని పేర్కొన్న న్యాయస్థానం.. ఆ విషయాన్ని ఆమెకే వదిలేసింది.

More Telugu News