Telangana: సాగునీటి ప్రాజెక్టుల దోపిడీపై వెంట‌నే సీబీఐతో విచార‌ణ జ‌రిపించాలి: వైఎస్ ష‌ర్మిల‌

  • తెలంగాణ కాంట్రాక్ట‌ర్లు క్వాలిఫై కాలేద‌ని ఆంధ్రా కాంట్రాక్ట‌ర్ల‌కు ప‌నులిచ్చార‌న్న ష‌ర్మిల‌
  • ప్రాజెక్టుల‌న్నీ మెగాకే క‌ట్ట‌బెట్టార‌ని ఆరోప‌ణ‌
  • 80 శాతం ప్రాజెక్టులు ఒకే కంపెనీకి ఇవ్వ‌డం దేశంలో ఎక్క‌డా లేద‌ని విమ‌ర్శ‌
ys sharmila demands cbi enquiry on telangana project

తెలంగాణ‌లో సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భారీ ఎత్తున దోపిడీ జ‌రుగుతోంద‌ని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల ఆరోపించారు. ఈ దోపిడీపై త‌క్ష‌ణ‌మే సీబీఐతో ద‌ర్యాప్తు చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేర‌కు బుధ‌వారం జ‌ల సౌధ‌లోని సాగునీటి శాఖ ఉన్న‌తాధికారుల‌కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె కేసీఆర్ స‌ర్కారు, మెగా కృష్ణారెడ్డిల మ‌ధ్య బంధంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణ కాంట్రాక్ట‌ర్లు క్వాలిఫై కాలేద‌న్న కార‌ణం చూపి ఆంధ్రా కాంట్రాక్ట‌ర్‌కు ప్రాజెక్టులు క‌ట్ట‌బెట్టార‌ని ష‌ర్మిల ఆరోపించారు. అందుకే ప్రాజెక్టులన్నీ మెగాకే ఇచ్చారని కూడా ఆమె తెలిపారు. కేసీఆర్, మెగా కృష్ణారెడ్డి దోస్తులు కాబ‌ట్టే తెలంగాణ సొమ్మును ప‌ట్ట‌ప‌గ‌లే దోచుకుతింటున్నారని ఆమె ధ్వ‌జ‌మెత్తారు. కాళేశ్వరం నా చెమట, నా రక్తం అన్న కేసీఆర్.. మూడేండ్ల‌కే ఆ ప్రాజెక్టు కూలిపోతే ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు. కాళేశ్వ‌రం కేసీఆర్‌ క‌మీష‌న్ల ప్రాజెక్టు మాత్ర‌మేన‌న్న ష‌ర్మిల‌.. ఒక్క‌రికే 80 శాతం ప్రాజెక్టులు క‌ట్ట‌బెట్ట‌డం దేశంలోనే ఎక్క‌డా లేదన్నారు. తెలంగాణ తెచ్చుకుంది వీళ్లిద్ద‌రి కోస‌మేనా? అని ఆమె ప్ర‌శ్నించారు.

More Telugu News