Asia Cup: ఆసియా కప్ షెడ్యూల్ విడుదల... ఆగస్టు 28న భారత్, పాకిస్థాన్ సమరం

  • శ్రీలంకలో సంక్షోభం
  • యూఏఈ తరలివెళ్లిన టోర్నీ
  • ఆగస్టు 27 నుంచి ఆసియా కప్
  • ఒకే గ్రూప్ లో దాయాదులు
  • సెప్టెంబరు 11తో ముగియనున్న పోటీలు
Asia Cup Schedule released

శ్రీలంకలో సంక్షోభం కారణంగా ఈ ఏడాది ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ యూఏఈకి తరలిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆసియా కప్ షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11వ తేదీ వరకు దుబాయ్, షార్జా మైదానాల్లో టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లతో పాటు ఓ క్వాలిఫయర్ టీమ్ కూడా పాల్గొంటోంది. అర్హత పోటీల్లో విజేతగా నిలిచిన జట్టుకు ఆసియా అగ్రజట్లతో ఆడే అవకాశం కల్పిస్తారు. క్వాలిఫైయింగ్ పోటీల్లో యూఏఈ, సింగపూర్, హాంకాంగ్, కువైట్ జట్లు తలపడనున్నాయి.

ఈ టోర్నీ రెండు దశల్లో సాగనుంది. తొలుత గ్రూప్ దశ పోటీలు జరగనున్నాయి. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ లతో పాటు ఓ క్వాలిఫయర్ టీమ్ కూడా 'ఏ' గ్రూప్ లో ఉంది. ఇక 'బి' గ్రూప్ లో శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. ఈ రౌండ్ లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు రెండో రౌండ్ కు అర్హత సాధిస్తాయి. వీటిలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్లో అడుగుపెడతాయి.  

కాగా, టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఆగస్టు 28న అత్యంత ఆసక్తికరమైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. టీ20 వరల్డ్ కప్ లో పాక్ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని టీమిండియా తహతహలాడుతుంది. ఈ నేపథ్యంలో, రెండు జట్ల మధ్య మరోసారి రోమాంఛక పోరు ఖాయమనిపిస్తోంది.
.

More Telugu News