Earthquake: ఫిలిప్పీన్స్ లో 7.1 తీవ్రతతో భూకంపం.. భారీగా ఆస్తి నష్టం!

  • ఇప్పటివరకు నలుగురు మరణించినట్టు సమాచారం 
  • రాజధాని మనీలా వరకు వణికిన భూమి
  • వెంటనే సహాయక చర్యలు చేపట్టామన్న అధ్యక్షుడు 
Earthquake Hits Philippines

ఫిలిప్పీన్స్ ఉత్తర ప్రాంతంలోని ల్యుజాన్ ద్వీపాన్ని భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్ పై ఏకంగా 7.1 తీవ్రతతో ప్రకంపనలు నమోదైనట్టు ఆ దేశ అధికారులు ప్రకటించారు. ఫిలిప్పీన్స్ ఆగ్నేయ ప్రాంతంలోని డొలోరస్ పట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. దాదాపు 30 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయని.. ఈ తీవ్రత కారణంగా ఫిలప్పీన్స్ రాజధాని మనీలా వరకు ప్రకంపనలు వచ్చాయని, ఇళ్లు ఊగిపోయాయని తెలిపారు.

మారుమూల ప్రాంతం కావడంతో..
అయితే ప్రధానంగా అధిక స్థాయి ప్రకంపనలు వచ్చిన ప్రాంతంలో భారీ నివాసాలు, జనాభా తక్కువ కావడంతో ప్రాణ నష్టం తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక్కడి బెంగ్యూట్ ప్రావిన్స్ లో ఇద్దరు, అబ్ర ప్రావిన్స్ లో ఒకరు, మరోచోట ఇంకొకరు.. మొత్తంగా నలుగురు చనిపోయినట్టు, 60 మందికిపైగా గాయాలపాలైనట్టు సమాచారం అందిందని ప్రకటించారు. వేగంగా సహాయ కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. అబ్రా ప్రాంతంలోని ఓ ఆసుపత్రి ఆస్పత్రి పాక్షికంగా కూలిపోవడంతో అందులోని రోగులు, సిబ్బందిని వెంటనే తరలించామని తెలిపారు.

వేగంగా చర్యలు చేపట్టాం.
‘‘భూకంపం కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టు సమాచారం అందింది. ఈ విపత్తు కారణంగా ప్రభావితమైన వారిని ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాం..” అని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మాక్రోస్ ప్రకటించారు. కాగా.. భారీ భూకంపం అనంతరం మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు సూచించారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

‘‘భూకంపం కారణంగా మా ఇల్లు ఊగిపోయింది. కూలిపోతుందేమో అన్నంతగా భయమేసింది. దాదాపు 30 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగానే ఆస్తి నష్టం జరిగింది. మళ్లీ ప్రకంపనలు (ఆఫ్టర్ షాక్స్) వస్తుండటంతో అంతా ఇళ్లు వదిలి ఆరుబయటే గడుపుతున్నాం..” అని ఇలోకోస్ సుర్ ప్రావిన్స్ కు చెందిన ప్రజాప్రతినిధి ఎరిక్ సింగ్సన్ తెలిపారు.

More Telugu News