ప్రభుత్వ విద్యా విధానాన్ని తప్పుపట్టే హక్కు టీచర్లకు లేదు: ఏపీ మంత్రి బొత్స

Botsa satyanarayana comments on teachers
‘‘ఉపాధ్యాయులంతా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారా? ప్రభుత్వ స్కూళ్లలో ప్రీప్రైమరీ అవసరం లేదంటున్న ఉపాధ్యాయులు తమ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు?” అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విద్యా రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాలను తప్పుపట్టే హక్కు ఉపాధ్యాయులకు లేదని పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు భాగమని.. అందువల్ల ఉపాధ్యాయులు లేవనెత్తుతున్న అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు.

నాణ్యత పెంచేందుకే సంస్కరణలు
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచేందుకే సంస్కరణలు అమలు చేస్తున్నామని.. వీటి ఫలితాలు వచ్చేందుకు కాస్త సమయం పడుతుందని బొత్స సత్యనారాయణ అన్నారు. సీబీఎస్ఈ సిలబస్ అమలు, ఆంగ్ల మాధ్యమంలో బోధన, డిజిటల్ క్లాస్ రూమ్‌ల వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. పాఠశాలల విలీనం విషయంపై విద్యార్థుల తల్లితండ్రులు ఎక్కడా అభ్యంతరం చెప్పడం లేదని.. ఎవరో కుట్రలు చేసి ఈ విధానాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని బొత్స మండిపడ్డారు.

ప్రైవేటు సంస్థలకు అవకాశం ఇవ్వకనే జాప్యం
గతంలో వ్యాపారం కోసం ప్రైవేటు సంస్థలు పాఠ్య పుస్తకాలను ముద్రించి విక్రయించుకునేందుకు అనుమతి ఇచ్చారని.. కానీ తాము ప్రభుత్వం ఇచ్చిన పుస్తకాలనే పంపిణీ చేసేలా చర్యలు చేపట్టామని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ కారణంగానే పాఠ్య పుస్తకాల విషయంలో జాప్యం జరిగిందని పేర్కొన్నారు. పాఠ్య పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా ఇస్తున్నామని.. ప్రైవేటు పాఠశాలలకు నిర్దేశిత ధరకే అందజేస్తున్నామని వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన సిలబస్ ను ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అన్నీ అమలు చేసేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 

Go Back to Shorts
Andhra Pradesh
Botsa
Botsa Satyanarayana
Education
Teachers
Politics
YSRCP

More Telugu News