Scam: బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ స్కాంలో ఈడీ సోదాలు... గుట్టలు గుట్టలుగా డబ్బు... ఫొటోలు ఇవిగో!

  • బెంగాల్ లో రూ.100 కోట్ల స్కాం బట్టబయలు
  • ఈడీ సోదాల్లో రూ.20 కోట్ల నగదు లభ్యం
  • బెంగాల్ మంత్రుల ఇళ్లలోనూ సోదాలు
  • టీఎంసీ సర్కారుపై బీజేపీ విమర్శనాస్త్రాలు
ED searches in Bengal ministers residences in Kolkata

పశ్చిమ బెంగాల్ లో కోట్లాది రూపాయల భారీ స్కాం వెలుగుచూసింది. బెంగాల్ విద్యాశాఖకు సంబంధించి స్కూల్ సర్వీస్ కమిషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డులో ఈ రిక్రూట్ మెంట్ కుంభకోణం జరిగినట్టు భావిస్తున్నారు. ఎస్ఎస్ సీ ద్వారా టీచర్ల నియామకం చేపట్టే క్రమంలో కోట్లాది రూపాయలు చేతులుమారినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేడు సోదాలు చేపట్టింది. 

బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ (గతంలో విద్యాశాఖ మంత్రి) సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ నివాసంలో ఈడీ జరిపిన సోదాల్లో డబ్బు గుట్టలు గుట్టలుగా బయటపడింది. ఈ మొత్తం రూ.20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అటు, పార్థ ఛటర్జీ నివాసంతో పాటు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి పరేష్ అధికారి నివాసంలోనూ ఈడీ అధికారులు సోదా చేశారు. బెంగాల్ వ్యాప్తంగా 13 ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు జరిగాయి. 

ఇదే అదనుగా బీజేపీ నేతలు టీఎంసీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. డబ్బు, బిర్యానీ పంచి ప్రజలను సమీకరిస్తూ ప్రతిసారి మోసం చేయలేరని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకే ఈడీ సోదాలు జరుగుతున్నాయని వెల్లడించారు. జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరి నివాసంలో సోదాలు చేయాల్సి ఉంటుందని అన్నారు. ఇది రూ.100 కోట్ల భారీ స్కాం అని దిలీప్ ఘోష్ పేర్కొన్నారు. కాగా, ఈ స్కాంలో బయటపడిన నోట్ల కట్టల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
.

More Telugu News