delhi High court: రెస్టారెంట్లలో సర్వీస్ చార్జీ వసూలు చేయవద్దన్న ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టు స్టే

  • ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసిన రెస్టారెంట్ల జాతీయ సంఘం
  • పార్సిల్ తీసుకెళ్లే వారి నుంచి తీసుకోవడం లేదని వాదన
  • మెనూల్లో, ఇతర ప్రదేశాల్లో సర్వీస్ చార్జీని ప్రదర్శించాలని కోర్టు సూచన
Delhi HC halts no service charge order on restaurants next hearing Nov 25

రెస్టారెంట్లలో సర్వీస్ చార్జీ వసూలు చేయరాదంటూ కేంద్ర వినియోగదారుల పరిరక్షణ విభాగం (సీపీపీఏ) తీసుకొచ్చిన ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. అన్ని ఆహార విక్రయశాలలు సర్వీస్ చార్జీ గురించి స్పష్టంగా తెలిసేలా మెనూల్లో, ఇతర ప్రదేశాల్లో ప్రదర్శించాలని న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిప్రాయపడ్డారు. సీసీపీఏ ఆదేశాలను సవాల్ చేస్తూ నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఈ పిటిషన్ దాఖలు చేసింది.

హోటళ్లకు వచ్చి పార్సిల్ రూపంలో తీసుకెళితే సర్వీస్ చార్జీ వసూలు చేయడం లేదని రెస్టారెంట్ల అసోసియేషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. సర్వీసు చార్జీ చెల్లించాలంటూ వినియోగదారులను ఒత్తిడి చేయడం కుదరదని సీసీపీఏ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఇది వినియోగదారుల ఎంపికకు సంబంధించినదని, చెల్లించడం ఇష్టం లేకపోతే రెస్టారెంట్లోకి అడుగు పెట్టక్కర్లేదని కోర్టు వ్యాఖ్యానించింది.

అసలు సర్వీసు చార్జీ అన్నది వినియోగదారుల పరిరక్షణ చట్టం పరిధిలోకి వస్తుందా? అన్న సందేహం వ్యక్తం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను నవంబర్ 25కు వాయిదా వేసింది. దీంతో అప్పటి వరకు రెస్టారెంట్లు పూర్వం మాదిరే బిల్లులో భాగంగా సర్వీసు చార్జీ తీసుకునే వెసులుబాటు కల్పించినట్టయింది.

More Telugu News