BJP: పరేడ్ గ్రౌండ్స్ సభకు గద్దర్.. హెచ్ఐసీసీ నుంచి బస్సుల్లో సీనియర్ నేతలు

  • మోదీ ప్రసంగం వినేందుకే వచ్చానన్న గద్దర్
  • సభ అనంతరం మీడియాతో మాట్లాడుతానని వెల్లడి
  • హెచ్ఐసీసీ నుంచి సభా స్థలికి వీఐపీలను తరలించేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు
  • వర్షం పడుతుండటంతో సభా స్థలంలో ఇబ్బందులు
Gaddar to Parade Grounds Sabha Senior leaders from HICC in buses

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న బీజేపీ ‘విజయ సంకల్ప సభ’కు ప్రజా గాయకుడు గద్దర్ వెళ్లారు. చాలా కాలం వామపక్షాల తరఫున నిలిచిన గద్దర్.. వాటికి విరుద్ధంగా ఉండే బీజేపీ సభా ప్రాంగణానికి రావడం గమనార్హం. తాను ప్రధాని మోదీ ప్రసంగాన్ని వినడానికే సభకు వచ్చానని.. ఆయన ఏం సందేశం ఇస్తారన్నది విన్నాక తాను మీడియాతో మాట్లాడుతానని చెప్పారు. ఇటీవల కొంతకాలంగా రాజకీయ నేతలను కలుస్తున్న గద్దర్.. గతంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల సభకూ హాజరయ్యారు.

బస్సుల్లో సభా ప్రాంగణానికి నేతలు
హెచ్ఐసీసీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న నేతలు.. ప్రత్యేక బస్సుల్లో పరేడ్ గ్రౌండ్స్ సభా ప్రాంగణానికి వెళ్తున్నారు. ఈ మేరకు హెచ్ఐసీసీ వద్ద ప్రత్యేక బస్సులను బీజేపీ నేతలు సిద్ధం చేశారు. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య బస్సులను పరేడ్ గ్రౌండ్స్ కు తీసుకెళ్లనున్నారు. 

  • పరేడ్ గ్రౌండ్ సభకు ప్రధాని మోదీ, ఇతర వీవీఐపీలు వస్తుండటంతో వేదిక, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎస్పీజీ భద్రత ఏర్పాటు చేశారు. గ్రౌండ్ లోపల 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, అందరినీ క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. 
  • పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా వర్షం పడుతోంది. సభా ప్రాంగణంలో భారీ టెంట్లు ఏర్పాటు చేయడంతో సభికులు వాటి కిందకు చేరారు. అయితే సభకు వస్తున్న వారికి మాత్రం ఇబ్బంది ఎదురవుతోంది.

More Telugu News