Telangana: అందుకే యశ్వంత్​ సిన్హాకు మద్దతు ఇస్తున్నాం: కేటీఆర్​

Against BJP dictatorship says KTR on support for Yashwant Sinha
విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. యశ్వంత్‌ సిన్హాకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. యశ్వంత్‌ సిన్హాను హైదరాబాద్‌కు ఆహ్వానించామని చెప్పారు.

బీజేపీ నిరంకుశ విధానాలను నిరసిస్తూ..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ, నిరంకుశ విధానాలతో పాలన సాగిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం వచ్చాక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని.. ఇప్పటివరకు ఎనిమిది రాష్ట్రాల్లో బీజేపీకి మెజారిటీ లేకపోయినా తప్పుడు మార్గాల్లో అధికారం పొంది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని విమర్శించారు. 

రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని.. రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ బీజేపీ తీరును వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని తిరస్కరిస్తూ.. విపక్షాల అభ్యర్థిని బలపరిచామని ప్రకటించారు. అయితే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పట్ల వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదని వెల్లడించారు.

అంత ప్రేమ ఉంటే రిజర్వేషన్లు పెంచాలి
రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళను నిలిపామని బీజేపీ చెబుతోందని.. వారిపై అంత ప్రేమ ఉంటే గిరిజన రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గిరిజన రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి నాలుగేళ్లు అయిందని గుర్తు చేశారు. ఇప్పటికీ దానిని ఆమోదించలేదని విమర్శించారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని పునర్విభజన చట్టంలో పెట్టారని, ఇప్పటికీ దానికి అతీగతీ లేదని మండిపడ్డారు.
Telangana
KTR
Trs
BJP
NDA
Rashtrapati
Rashtrapati election

More Telugu News