America: మీ నిబద్ధతతో తెలుగుజాతి సురక్షితం: న్యూజెర్సీ ‘మీట్ అండ్ గ్రీట్’లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

  • తెలుగు కమ్యూనిటీస్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ‘మీట్ అండ్ గ్రీట్’
  • తెలుగు తల్లి ముద్దుబిడ్డగా ఉన్న వారిని కలవడం సంతోషంగా ఉందన్న జస్టిస్ రమణ
  • వారి నిబద్ధత చూస్తుంటే ముచ్చటేస్తోందన్న చీఫ్ జస్టిస్
Justice NV Ramana Praises Telugu people who lives in America

‘‘మాతృభూమిని, సొంత మనుషులను వదులుకుని, ఆచార వ్యవహారాలకు పెద్ద పీట వేస్తూ జీవితాన్ని గడుపుతున్న మీ నిబద్ధతను చూస్తుంటే తెలుగు జాతి భవిష్యత్తు సురక్షితమన్న భావన కలుగుతోంది’’ అంటూ అమెరికాలోని తెలుగు ప్రజలపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసలు కురిపించారు. తెలుగు కమ్యూనిటీస్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ.. ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గీతంలో కార్యక్రమం ప్రారంభమైనందుకు ఆనందంగా ఉందన్నారు. తెలుగుతల్లి ముద్దుబిడ్డగా ఉన్న వారిని కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలుగు ప్రజల్లో తానూ ఒకడిగా ఉండడాన్ని గర్విస్తున్నానని అన్నారు. 

అమెరికాలో దాదాపు 7 లక్షల మంది తెలుగువారు ఉన్నారని, వారంతా ఎన్నో కష్టాలు అనుభవించి ముందుకు సాగుతున్నారని కొనియాడారు. వారి నిబద్ధతను చూస్తుంటే ముచ్చటేస్తోందని, వారి చేతుల్లో తెలుగు జాతి భవిష్యత్తు సురక్షితమన్న నమ్మకం కలుగుతోందన్నారు. పుట్టిన ఊరు, మట్టి వాసన గుబాళింపును నెమరువేసుకోవాలని జస్టిస్ రమణ సూచించారు.

More Telugu News