Tollywood: నేను ఏ పార్టీలోనూ లేను.. జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించినా కుదరలేదు: సినీ నటుడు సుమన్

  • తన ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి భార్య మొదటి వర్ధంతి కార్యక్రమానికి హాజరైన సుమన్
  • వెబ్ సిరీస్‌లలో అశ్లీలత పెరిగిపోయిందని ఆవేదన
  • సెన్సార్ బోర్డు జోక్యం చేసుకోవాలన్న నటుడు
  • జగన్ అపాయింట్‌మెంట్ దొరకలేదన్న సుమన్
want to meet jagan but but failed says actor suman

ప్రస్తుతానికి తాను ఏ పార్టీలోనూ లేనని ప్రముఖ సినీ నటుడు సుమన్ స్పష్టం చేశారు. విజయవాడ రూరల్ మండలం పి.నైనవరంలో సుమన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆలిండియా అధ్యక్షుడు ధూళిపాళ్ల దేవేంద్ర భార్య నిర్మల మొదటి వర్ధంతి కార్యక్రమానికి సుమన్ హాజరయ్యారు. అనంతరం సుమన్ విలేకరులతో మాట్లాడుతూ.. కరోనా తర్వాత ఓటీటీ ప్రభావం బాగా పెరిగిందన్నారు. ఓటీటీలో వస్తున్న కంటెంట్‌పై సెన్సార్‌బోర్డు పర్యవేక్షణ లేకపోవడంతో అశ్లీలత పెరిగిపోయిందన్నారు. వెబ్ సిరీస్‌ల మాటున అశ్లీలతను తెరకెక్కిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పద్ధతి కాదని, దీనిపై సెన్సార్‌ బోర్డు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుమన్ అన్నారు.

ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి పలు అవకాశాలు ఉన్నాయన్నారు. లొకేషన్లు, పోలీసు బందోబస్తు, త్వరితగతిన అనుమతి మంజూరు వంటి సదుపాయాలు కల్పిస్తే ఇక్కడ సినిమాలు తీసేందుకు ముందుకు వస్తారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు పలుమార్లు ప్రయత్నించానని, అపాయింట్‌మెంట్ కోరితే దొరకలేదని సుమన్ తెలిపారు.

More Telugu News