Yasin Malik: యాసిన్ మాలిక్ వ్యవహారంలో ఇస్లామిక్ దేశాల స్పందనపై భారత్ అసంతృప్తి

  • ఉగ్రవాద చర్యలకు నిధులు సమకూర్చినట్టు నిరూపణ 
  • కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ కు జీవితఖైదు
  • తీర్పుపై ఇస్లామిక్ దేశాల విమర్శలు
India condemns OIC countries remarks over Yasin Malik issue

కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ కు ఎన్ఐఏ కోర్టు జీవితఖైదు విధించడం తెలిసిందే. టెర్రరిస్టు కార్యకలాపాలకు నిధులు సమకూర్చాడన్న ఆరోపణలు రుజువు కావడంతో యాసిన్ మాలిక్ కు కోర్టు పైవిధంగా శిక్ష విధించింది. అయితే, ఈ తీర్పుపై ఇస్లామిక్ దేశాలు విమర్శిస్తుండడం పట్ల కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) దేశాలు తమ వ్యాఖ్యల ద్వారా టెర్రరిస్టు చర్యలకు పరోక్షంగా మద్దతు పలుకుతున్నట్టుగా ఉందని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చీ విమర్శించారు. 

యాసిన్ మాలిక్ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించామని స్పష్టం చేశారు. టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా, ఇస్లామిక్ దేశాలు దాన్ని ఏ విధంగానూ సమర్థించరాదని కోరుతున్నామని బాగ్చి ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఓఐసీ దేశాల వ్యాఖ్యలు తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఉగ్రభూతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని యావత్ ప్రపంచం ఆకాంక్షిస్తోందని వివరించారు.

More Telugu News