YSRCP: వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ్ బాబు కారులో డ్రైవర్ డెడ్ బాడీ.. అర్ధరాత్రి 2 గంటలకు తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగింత

  • యాక్సిడెంట్ లో చనిపోయాడన్న ఉదయ్ బాబు
  • ముమ్మాటికే హత్యేనంటున్న డ్రైవర్ కుటుంబం
  • కాకినాడలోని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల ఇంటి వద్ద ఉద్రిక్తత
Driver Deadbody Found In YCP MLA Car

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ చనిపోయి ఉన్నాడు. గురువారం ఉదయం సుబ్రహ్మణ్యాన్ని తీసుకుని ఉదయ్ బాబు బయటకు వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే, ఆ తర్వాత నిన్న అర్ధరాత్రి దాటాక 2 గంటలకు.. రోడ్డు ప్రమాదంలో సుబ్రహ్మణ్యం చనిపోయాడంటూ అతడి తమ్ముడికి ఉదయ్ బాబు ఫోన్ చేసి చెప్పారు. అంతేగాకుండా అప్పటికప్పుడు తన కారులోనే సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని తీసుకెళ్లి కాకినాడలోని అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. 

తొలుత కారు నుంచి మృతదేహాన్ని దించేందుకు సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో వారిపై ఎమ్మెల్సీ ఉదయ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. అసలేమైందో చెప్పేదాకా మృతదేహాన్ని దించబోమని మృతుడి కుటుంబ సభ్యులు తేల్చి చెప్పడంతో.. సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు పనిచేస్తున్న అపార్ట్ మెంట్ దగ్గరే ఆ కారును ఉదయ్ బాబు వదిలేశారు. వారి ప్రశ్నలకు జవాబు చెప్పకుండానే ఆయన మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇది రోడ్డు ప్రమాదం కానేకాదని, ముమ్మాటికీ హత్యేనని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపారని ఆరోపించారు. 

ఆ తర్వాత ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించారు. కారులో మృతదేహంతో పాటు మద్యం బాటిళ్లు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఐదేళ్లుగా ఉదయ్ వద్ద సుబ్రహ్మణ్యం పనిచేస్తున్నాడు. పోస్ట్ మార్టం నిమిత్తం సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా కుటుంబ సభ్యులు మాత్రం ససేమిరా అన్నారు. 

ఎమ్మెల్సీ వచ్చి సమాధానం చెప్పేదాకా మృతదేహాన్ని తీసుకెళ్లనివ్వబోమని కుటుంబ సభ్యులు, స్థానికులు తేల్చిచెప్పారు. అపార్ట్ మెంట్ ముందే ఆందోళన చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఎలాగోలా పోలీసులు కాసేపటి క్రితమే సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని కాకినాడ జనరల్ హాస్పిటల్ కు తరలించారు. 

కొన్నాళ్ల క్రితం సుబ్రహ్మణ్యం తన వద్ద రూ.70 వేలు తీసుకున్నట్టు ఉదయ్ బాబు ఫోన్ చేసి చెప్పాడని మృతుడి తల్లి చెప్పింది. అందులో రూ.50 వేలు తిరిగిచ్చేశారని, ఇంకో రూ.20 వేల కోసం మళ్లీ మళ్లీ ఫోన్ చేసేవారని చెప్పింది.

  • Loading...

More Telugu News