CEO: జట్టు ఎంపికలో మా సీఈవో పాత్ర కూడా ఉంటుంది: బయటపెట్టిన శ్రేయాస్ అయ్యర్

  • సాధారణంగా కోచ్ లతో చర్చిస్తుంటామన్న అయ్యర్
  • తమ జట్టు ఎంపికలో సీఈవో పాల్గొంటారని వెల్లడి
  • నిర్ణయం ఏదైనా అందరూ కలసికట్టుగా పోరాడతామని ప్రకటన
CEO Also Involved In Team Selection Captain Shreyas Iyer

కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సంచలన విషయాలు నోరు జారాడు. తమ జట్టు ఎంపికలో కోచ్ తోపాటు, సీఈవో వెంకీ కూడా పాల్గొంటారంటూ అయ్యర్ చెప్పడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు ఎదురవుతున్నాయి. సోమవారం ముంబై ఇండియన్స్ పై కేకేఆర్ విజయం తర్వాత అయ్యర్ మీడియాతో మాట్లాడాడు. 

‘‘11 మంది సభ్యుల తుది జట్టులో నీకు చోటు లేదంటూ చెప్పడం ఎంతో కష్టంగా ఉంటుంది. ఐపీఎల్ కు ఆడడం మొదలు పెట్టిన సమయంలో నేను కూడా ఈ అనుభవాన్ని ఎదుర్కొన్నా. సాధారణంగా మేము కోచ్ లతో చర్చిస్తుంటాం. సీఈవో సైతం జట్టు ఎంపికలో పాలుపంచుకుంటారు. ముఖ్యంగా బ్రెండాన్ మెక్ కల్లమ్ ముఖ్య పాత్ర పోషిస్తారు. ఆయనే వెళ్లి ఆటగాళ్లకు చెబుతారు. నిజం చెప్పాలంటే ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ ఎంతో మద్దతుగా నిలుస్తున్నారు. మైదానంలో ఒకరికొకరు సహకారంతో పనిచేస్తూ, మంచి ఫలితాలు రాబట్టేందుకు కృషి చేస్తున్నారు. అందుకే కెప్టెన్ గా గర్వపడుతున్నాను. ఈ రోజు ఆడిన ఆట పట్ల ఎంతో సంతోషంగా ఉన్నా’’ అని అయ్యర్ ప్రకటించాడు. 

జట్టు ఎంపికలో కేకేఆర్ సీఈవో వెంకీ మైసూరు పాల్గొనడం పట్ల ట్విట్టర్లో విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఒక సీజన్ తర్వాత శ్రేయాస్ కు ఉద్వాసన తప్పదంటూ అన్షుల్ గుప్తా అనే యూజర్ అభిప్రాయం తెలిపాడు. ‘‘టీమ్ సెలక్షన్ లో సీఈవో పాల్గొంటారని శ్రేయాస్ అయ్యర్ చెబుతున్నాడు. ఇది అస్సలు ఊహించలేదు’’ అని మరో యూజర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

More Telugu News