Vijayasai Reddy: 22 కేసుల్లో నిందితుడైన వ్యక్తి రాహుల్ గాంధీ సమావేశాలపై మాట్లాడడమా?: మాణికం ఠాగూర్ ఫైర్

Manickam Tagore Fires on YCP leader Vijayasai Reddy
  • రాహుల్ ప్రజాస్వామ్య బద్ధంగానే మేధావులు, పత్రికా యజమానులను కలిశారన్న మాణికం
  • అవినీతి పరులకే ఆ సమావేశాల్లో కుట్ర కనిపిస్తుందని ఎద్దేవా
  • కేటీఆర్ ఆస్తుల లక్ష్యమేంటో చెప్పాలని ప్రశ్న
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి పరుడైన విజయసాయి అర్ధరాత్రి సమావేశాలు నిర్వహించడంలో దిట్ట అని అన్నారు. రెండు రోజుల క్రితం వరంగల్‌ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో పలువురు మేధావులు, పత్రికా యజమానులతో సమావేశమయ్యారు. ఇలా సమావేశం కావడాన్ని తప్పుబడుతూ రాహుల్‌పై విజయసాయిరెడ్డి పలు విమర్శలు చేశారు. 

ఈ నేపథ్యంలో నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మాణికం.. 22 కేసుల్లో నిందితుడైన విజయసాయికి రాహుల్ గాంధీ గురించి మాట్లాడే హక్కులేదని అన్నారు. రాహుల్ ప్రజాస్వామ్య బద్ధంగానే వారిని కలిశారని అన్నారు. అర్ధ రాత్రి సమావేశాలు నిర్వహించే వారికి, అవినీతి పరులకే రాహుల్ సమావేశాల్లో కుట్ర కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. 

మరోవైపు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌పైనా మాణికం ఠాగూర్ విమర్శలు గుప్పించారు. ‘ఆస్క్ కేటీఆర్’ పేరుతో మంత్రి నిన్న ట్విట్టర్‌లో ప్రశ్నలు, జవాబుల కార్యక్రమాన్ని నిర్వహించారు. మాణికం ఇందులో పలు ప్రశ్నలు గుప్పించారు. 2014లో రూ. 7.98 కోట్లుగా ఉన్న మీ ఆస్తులు 2018 నాటికి రూ. 41.82 కోట్లకు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. 2018-2023 నాటికి మీ సంపాదన లక్ష్యమేంటని, ఇన్ని ఆస్తులు ఎలా పెరిగాయో చెప్పాలని ప్రశ్నలు సంధించారు.

More Telugu News

Vijayasai Reddy
Manickam Tagore
Congress
KTR
Rahul Gandhi