Rahul Gandhi: తెలంగాణ వల్ల ఒకేఒక కుటుంబం బాగుపడింది: రాహుల్ గాంధీ

  • వరంగల్ లో కాంగ్రెస్ రైతు సంఘర్షణ సభ
  • టీఆర్ఎస్ అధినాయకత్వంపై రాహుల్ విమర్శలు
  • కాంగ్రెస్ నష్టపోతుందని తెలిసీ తెలంగాణ ఇచ్చామని వెల్లడి
  • కానీ తాము ఉద్దేశించింది నెరవేరలేదని వ్యాఖ్యలు
Rahul Gandhi slams CM KCR family without naming

వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ అధినాయకత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ వల్ల ఒకేఒక కుటుంబం బాగుపడిందని పరోక్షంగా కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. తెలంగాణ ఏ ఒక్కరి వల్లో రాలేదని, తెలంగాణ ఏ ఒక్కరి కోసమే ఏర్పడలేదని అన్నారు. ఎంతోమంది త్యాగాలతో తెలంగాణ వచ్చిందని స్పష్టం చేశారు. 

ఈ వేదికపై భర్తల్ని కోల్పోయిన రైతుల భార్యలు ఉన్నారని, వారి దీన కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. రైతుల ఆత్మహత్యలకు ఎవరు బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. వారి కుటుంబ సభ్యుల వేదనకు ఎవరు కారణం? అని నిలదీశారు. ఇలాంటి బాధిత రైతు కుటుంబాలు రాష్ట్రమంతా ఉన్నాయని వెల్లడించారు. 

"తెలంగాణ కోసం ఎందరో పోరాటాలు చేశారు. రక్తాన్ని, కన్నీళ్లను చిందించారు. వారితో పాటు కాంగ్రెస్ కూడా పోరాడింది. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రజల కల నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీనే. ఎవరు బాగుపడతారని తెలంగాణ ఇచ్చామో వారు బాగుపడలేదు. తెలంగాణ ఇస్తే ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందని భావించాం. ఈ ముఖ్యమంత్రి ఒక రాజులా నియంతలా పరిపాలిస్తున్నాడు. పేరుకే ఆయన ముఖ్యమంత్రి... రాష్ట్రంలో రాజరికం నడుస్తోంది" అంటూ రాహుల్ విమర్శలు చేశారు.

More Telugu News