Rajachari: అంతరిక్షంలో ఆరు నెలలు గడిపి భూమికి చేరుకున్న తెలుగు సంతతి వ్యోమగామి రాజాచారి

  • గతేడాది అంతరిక్షంలోకి స్పేస్ ఎక్స్ యాత్ర
  • మిషన్ కమాండర్ గా వ్యవహరించిన రాజాచారి
  • ఐఎస్ఎస్ లో సుదీర్ఘకాలం గడిపిన వైనం
  • గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరంలో ల్యాండైన డ్రాగన్ కాప్సూల్
Telugu origin astronaut Rajachari safely landed

ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఆరు నెలల కిందట చేపట్టిన రోదసి యాత్ర విజయవంతంగా ముగిసింది. నలుగురు వ్యోమగాములతో కూడిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ కాప్సూల్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరంలో ల్యాండైంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) నుంచి భూమికి పయనమైన 24 గంటల్లోపే ఈ డ్రాగన్ కాప్సూల్ గమ్యస్థానానికి చేరింది. ఇందులో తెలుగు సంతతి వ్యోమగామి రాజాచారి కూడా ఉండడం విశేషం. 

రాజాచారి నాసా తరఫున ఈ యాత్రలో కమాండర్ హోదాలో పాల్గొన్నారు. ఆయనతో పాటు నాసా పైలెట్ థామస్ మార్ష్ బర్న్, మిషన్ స్పెషలిస్ట్ కైలా బారన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన మథియాస్ మౌరర్ కూడా భూమికి తిరిగి వచ్చారు. దీనికి సంబంధించిన చిత్రాలను నాసా విడుదల చేసింది.

ఈ యాత్రకు కమాండర్ గా వ్యవహరించిన రాజాచారి తెలుగు మూలాలున్న వ్యక్తి. ఆయన తండ్రి పేరు శ్రీనివాస్ చారి. రాజాచారి తాత మహబూబ్ నగర్ జిల్లా వాసి. కాగా, రాజాచారి తండ్రి శ్రీనివాస్ చారి ఉస్మానియా వర్సిటీ నుంచి ఇంజినీరింగ్ చేసిన అనంతరం పైచదువుల కోసం అమెరికా వెళ్లారు. పెగ్గీ ఎగ్ బర్ట్ అనే యువతిని పెళ్లాడి అమెరికాలోనే స్థిరపడ్డారు. 

రాజాచారి 1977 జూన్ 24న అమెరికాలోనే జన్మించారు. అక్కడే ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆస్ట్రోనాటిక్స్, ఏరోనాటిక్స్ సబ్జెక్టులతో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. ఆపై అమెరికా నేవీ టెస్ట్ పైలెట్ స్కూల్లో శిక్షణ అనంతరం 2017లో నాసా ఆస్ట్రోనాట్ గా అవకాశం దక్కించుకున్నారు.

More Telugu News