Komatireddy Venkat Reddy: గతేడాది హైదరాబాదులో పడిన వర్షం నిన్న యాదగిరిగుట్టలో కురిసి ఉంటే గుడి కూడా కూలిపోయేది: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Congress MP Komatireddy Venkata Reddy slams KCR govt over Yadadri rain chaos
  • నిన్న యాదాద్రిలో భారీ వర్షం.. కుంగిన రోడ్డు
  • క్యూ కాంప్లెక్స్ లోకి భారీగా వర్షపు నీరు
  • తీవ్రంగా ఇబ్బందులు పడిన భక్తులు
  • రూ.2 వేల కోట్లతో ఏం చేశారన్న కోమటిరెడ్డి
నిన్న కురిసిన భారీ వర్షంతో యాదాద్రి క్షేత్రంలో ఓ రోడ్డు కుంగిపోవడం తెలిసిందే. ఆలయ క్యూ కాంప్లెక్స్ లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. మొత్తానికి వర్షంతో ఇక్కడి లోపాలు బయటపడ్డాయి. దీనిపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

గతేడాది హైదరాబాదులో కురిసిన వర్షం నిన్న యాదగిరిగుట్టలో పడి ఉంటే గుడి కూడా కూలిపోయేదని అన్నారు. కేవలం 2 గంటల పాటు కురిసిన వర్షానికే రోడ్లు, క్యూలైన్లు భారీగా దెబ్బతిన్నాయని, ఆలయం ఎదురుగా చెరువులు తయారయ్యాయని విమర్శించారు. పాతికసార్లు ఇక్కడికి వచ్చి సీఎం కేసీఆర్ ఏంచేశారని కోమటిరెడ్డి ప్రశ్నించారు. 

ఓ ఆర్ట్ డైరెక్టర్ కు, కాంట్రాక్టర్లకు పని అప్పగించి రూ.2 వేల కోట్లు నాశనం చేశారని మండిపడ్డారు. యాదాద్రి పనుల్లో ఎవరు, ఎంత దోచుకున్నారు? అనే అంశంపై సీబీసీఐడీ దర్యాప్తు చేయించాలని, పనుల నాణ్యత అంశంపైనా విజిలెన్స్ తో విచారణ జరిపించాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.
Komatireddy Venkat Reddy
Yadadri
Rain
KCR
Telangana

More Telugu News