Kodandaram: కేంద్ర ప్రభుత్వ గెజిట్ తో రాష్ట్రాల హక్కులు పోతాయి: కోదండరామ్

  • నదీ జలాలకు సంబంధించి రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్న కోదండరామ్ 
  • గెజిట్ వల్ల ప్రాజెక్టులపై కేంద్రానికి సంపూర్థ అధికారం ఉంటుందని వ్యాఖ్య 
  • నదీ జలాల హక్కుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శ 
Kodandaram fires on TRS

కేంద్ర గెజిట్ తో కృష్ణానది జలాలకు సంబంధించి తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. గెజిట్ వల్ల ప్రాజెక్టులపై కేంద్రానికి సంపూర్ణ అధికారం ఉంటుందని... రాష్ట్రాలకు ఉన్న హక్కులు పోతాయని చెప్పారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పెండింగ్ లోనే ఉన్నాయని... గెజిట్ అమలైతే వీటిని పూర్తి చేసే అవకాశం ఉండదని అన్నారు. నదీ జలాల హక్కుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. 

రాష్ట్రంలో ప్రగతి భవన్, సచివాలయం, కాళేశ్వరం ప్రాజెక్టులు మాత్రం పూర్తయ్యాయని... పాలమూరు ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదని కోదండరామ్ ప్రశ్నించారు. కమీషన్లు రావనే కారణంగానే ఈ ప్రాజెక్టులను పక్కన పెట్టారా? అని నిలదీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో మహబూబ్ నగర్, నల్గొండలు ఎడారిగా మారుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గెజిట్ ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. కృష్ణానది జలాల పరిరక్షణ కోసం పానగల్ నుంచి యాత్రను ప్రారంభిస్తున్నామని... నక్కల గండి వద్ద యాత్ర ముగుస్తుందని చెప్పారు. ఆరు రోజుల పాటు యాత్ర కొనసాగుతుందని ఆయన తెలిపారు.

More Telugu News