ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా హింసకు గురవుతున్నారు: జో బైడెన్ ఆవేదన

Joe Biden says Muslims being targeted for violence
రంజాన్ పర్వదినం సందర్భంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రసంగిస్తూ, ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా హింసకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా చాలామంది ముస్లింలు దాష్టీకానికి బలవుతున్న ఘటనలే ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. మత విశ్వాసాల ఆధారంగా ఎవరిపైనా వివక్ష చూపించడం కానీ, అణచివేతకు పాల్పడడం కానీ చేయరాదని బైడెన్ స్పష్టం చేశారు. 

ఉయిగర్లు, రోహింగ్యాలతో పాటు హింస, దుర్భిక్షం, అంతర్యుద్ధాలు ఎదుర్కొంటున్న వారు నేడు రంజాన్ జరుపుకోలేకపోవచ్చని, అలాంటివారందరినీ తాము స్మరించుకుంటున్నామని వివరించారు. సమాజంలో ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ముస్లింలు అమెరికా అభ్యున్నతి కోసం ప్రతి రోజు శ్రమిస్తున్నారని కొనియాడారు. 

కాగా, ప్రపంచ చరిత్రలో మతం, జాతి, పుట్టుక, ప్రాంతీయతలను పట్టించుకోని సిద్ధాంతాల ఆధారంగా ఏర్పాటైన దేశం అమెరికా ఒక్కటే అని బైడెన్ ఉద్ఘాటించారు. కేవలం ఒక అవగాహన ప్రాతిపదికగానే అమెరికా ఏర్పడిందని పేర్కొన్నారు.
Go Back to Shorts
Joe Biden
Ramadan
Muslims
White House
USA

More Telugu News