Jignesh Mevani: నిన్న బెయిల్ వ‌చ్చిన త‌ర్వాత అల్లు అర్జున్ లా 'పుష్ప' డైలాగు చెప్పిన జిగ్నేశ్ మేవానీ.. వీడియో ఇదిగో

  • 'తగ్గేదే లే' అని డైలాగ్ చెప్పిన మేవానీ
  • పుష్ప రాజ్‌లా గ‌డ్డం కింద చేతిని పెట్టిన వైనం
  • త‌న‌ అరెస్ట్‌ సాధారణ విషయం కాదని వ్యాఖ్య‌
  • ఎన్నిక‌ల నేప‌థ్యంలో త‌న‌పై కుట్ర ప‌న్నార‌ని ఆరోప‌ణ‌
Jignesh Mevani slams bjp

అసోంలో మహిళా కానిస్టేబుల్ పై దుర్భాషలాడారంటూ గుజ‌రాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీపై కేసు పెట్టగా, ఆయ‌న‌కు నిన్న బెయిల్‌ లభించిన విషయం తెలిసిందే. దీంతో, బెయిల్‌పై బయటికి వచ్చిన ఆయ‌న టాలీవుడ్ హీరో అ‍ల్లు అర్జున్ న‌టించిన‌ 'పుష్ప' సినిమాలోని డైలాగ్ చెప్పారు. తగ్గేదే లే అని చెబుతూ, పుష్ప రాజ్‌లా గ‌డ్డం కింద చేతిని పెట్టారు. 
 
అలాగే, త‌న‌ అరెస్ట్‌ సాధారణ విషయం కాదని, పీఎంవోలో ఉన్న రాజకీయ నాయ‌కుల సూచనలతోనే జరిగింద‌ని మేవానీ ఆరోపించారు. త‌న‌పై అసోంలో కేసు పెట్ట‌డానికి ముందు ప్ర‌ధాని మోదీ గురించి తాను చేసిన ట్వీట్‌లో తప్పేం లేదని అన్నారు. 

ఇటీవ‌ల చోటు చేసుకున్న మత ఘర్షణలను, అల్లర్లను చూసి భార‌త పౌరుడిగా శాంతి సామరస్యాలను కాపాడాల‌ని తాను ప్రధాని మోదీని కోరాన‌ని, అలా అడగడానికి త‌నకు హక్కు ఉందని మేవానీ చెప్పారు.  చట్ట సభ ప్రతినిధిగా శాంతిని పాటించాలని ప్రజలను కోరాన‌ని తెలిపారు. ఈ మాత్రం దానికే త‌న‌పై కేసు పెట్టి అరెస్ట్‌ చేశారని ఆయ‌న తెలిపారు.  

త‌న‌పై పెట్టిన రెండో కేసుపై స్పందిస్తూ... అధికారం ఉందని మ‌హిళ‌ను అడ్డుపెట్టుకుని తనపై అక్రమ కేసు పెట్టార‌ని మేవానీ ఆరోపించారు. ఇది పిరికిపంద చర్యగా ఆయ‌న అభివ‌ర్ణించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేప‌థ్యంలోనే బీజేపీ ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆయ‌న చెప్పారు. 

త‌న‌ను అరెస్ట్ చేసిన స‌మ‌యంలో తనకు మద్దతు తెలిపిన అసోం ప్రజల‌కు, కాంగ్రెస్ పార్టీకి  ధన్యవాదాలు తెలిపారు. గుజ‌రాత్‌కు చెందిన త‌న‌పై అసోంలో కేసులు పెట్టి, అరెస్ట్‌ చేయడం బీజేపీ ప‌న్నిన‌ కుట్రగా ఆయ‌న చెప్పారు. ప్ర‌భుత్వాన్ని ప్రశ్నించేవారిపై అక్రమంగా కేసులు పెడుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. దళితులు, గుజరాత్‌ ప్రజలు ఈ విష‌యాన్ని గమనిస్తున్నారని ఆయ‌న చెప్పారు.       

    

More Telugu News