Karumuri Nageswara Rao: బలవంతంగా ఎవరికీ నగదు బదిలీ చేయబోము: ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

  • రేషన్ కు నగదు బదిలీ విషయంలో ఎవరిపై ఒత్తిడి ఉండదన్న మంత్రి 
  • ఇష్టమైన వారు మాత్రమే డబ్బులు తీసుకోవచ్చని వివరణ 
  •  జూన్ లో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని వెల్లడి 
Karumuri Nageswara Rao fires on Somu  Veerraju

రేషన్ కు నగదు బదిలీ చేసే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. బియ్యం తీసుకోని లబ్ధిదారులకు ప్రభుత్వం డబ్బును జమచేయనుంది. మరోవైపు దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇది ఆహార భద్రత అంశానికి విరుద్ధమని విమర్శిస్తున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజలు బియ్యమే కావాలని కోరుకుంటున్నారని... ఇంటింటికి రేషన్ పథకాన్ని అటకెక్కించేందుకే ప్రభుత్వం కొత్త నాటకం ఆడుతోందని ఆయన దుయ్యబట్టారు. 

ఈ నేపథ్యంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, రేషనుకు నగదు బదిలీపై సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. ఈ పథకాన్ని 2017లోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని... తాము దాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ పథకాన్ని విమర్శించడమంటే మోదీని విమర్శించినట్టేనని అన్నారు. 

రాష్ట్రంలో కొంత మంది బియ్యానికి బదులు వేరే ఆహారం తీసుకుంటున్నారని మంత్రి అన్నారు. గ్రామంలో ఎంత మంది ఇష్టపడితే అంత మందికి మాత్రమే నగదు బదిలీ చేస్తామని చెప్పారు. బలవంతంగా ఎవరికీ నగదు బదిలీ చేయబోమని తెలపారు. కార్డులు పోతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. జూన్ లో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పారు.

More Telugu News