YSRCP: నిప్పు లేకుండానే పొగ‌!... సీఎంతో భేటీ త‌ర్వాత అనిల్‌తో విభేదాలపై కాకాణి వ్యాఖ్య‌!

  • అనిల్‌తో క‌లిసి సీఎం జ‌గ‌న్‌తో కాకాణి భేటీ
  • భేటీ త‌ర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి
  • అనిల్‌తో విభేదాలు లేవ‌ని ప్ర‌క‌ట‌న‌
kakani comments on meeting with cm ys jagan along with anil kumar yadav

ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి... తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌తో త‌న‌కేమీ విభేదాలు లేవ‌ని తేల్చి చెప్పారు. నిప్పు లేకుండానే పొగ వ‌స్తోంద‌ని కూడా ఆయ‌న‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. అనిల్‌తో త‌న‌కు ఎలాంటి విభేదాలు లేకున్నా..మీడియానే వాటిని సృష్టిస్తోంద‌ని కూడా కాకాణి ఆరోపించారు. ఈ మేర‌కు సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో అనిల్ తో క‌లిసి భేటీ ముగిసిన త‌ర్వాత మీడియాలో మాట్లాడిన కాకాణి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్‌తో త‌న‌కు విభేదాలున్నాయ‌ని మీకు ఎవ‌రు చెప్పారంటూ కాకాణి మీడియా ప్ర‌తినిధుల‌ను ఎదురు ప్ర‌శ్నించారు. గ‌తంలో అనిల్ మంత్రిగా ఉంటే... తాను ఎమ్మెల్యేగా ఉన్నాన‌ని చెప్పిన కాకాణి.. ఇప్పుడు తాను మంత్రిగా, అనిల్ ఎమ్మెల్యేగా ఉన్నార‌ని చెప్పారు. అనిల్‌ను కొత్త‌గా రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్‌గా నియ‌మించిన నేప‌థ్యంలో కలిసిక‌ట్టుగా ప‌నిచేయాల‌ని మాత్ర‌మే సీఎం జ‌గ‌న్ త‌మ‌కు సూచించార‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. సీఎంతో త‌మ భేటీ కేవ‌లం 5 నిమిషాల్లోనే పూర్తి అయింద‌ని కూడా కాకాణి తెలిపారు.

అనిల్‌తో కాకాణి విభేదాల నేప‌థ్యంలో ఇద్ద‌రు నేత‌ల‌ను సీఎం పిలిచార‌ని, ఈ సంద‌ర్భంగా వారిద్ద‌రికీ జ‌గ‌న్ క్లాస్ పీకారంటూ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌పైనా కాకాణి స్పందించారు. అస‌లు త‌మ మ‌ధ్య విభేదాలే లేనప్పుడు సీఎం ఎందుకు క్లాస్ పీకుతార‌ని ప్ర‌శ్నించారు. నిప్పు లేకుండా పొగ రాదు క‌దా? అన్న మీడియా ప్ర‌తినిధుల ప్ర‌శ్న‌కు చాలా వేగంగా స్పందించిన కాకాణి.. నిప్పు లేకుండానే పొగ వ‌స్తోంద‌ని, అదే మీడియా గొప్ప‌త‌నమంటూ కామెంట్ చేశారు. అనిల్‌తో క‌లిసి పార్టీని మ‌రోమారు అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు కృషి చేస్తాన‌ని కాకాణి తెలిపారు.

More Telugu News