Golla Baburao: ఆవేశంలో అన్న మాటలు అవి... వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వివరణ

  • ఏపీలో కొత్త మంత్రివర్గం
  • ఒకట్రెండు రోజులు చెలరేగిన అసంతృప్త జ్వాలలు
  • కాస్త ఆలస్యంగా భగ్గుమన్న పాయకరావు పేట ఎమ్మెల్యే
  • అంతకంతకు దెబ్బతీస్తానని వార్నింగ్
  • తన వ్యాఖ్యలు వక్రీకరించారంటూ తాజా ప్రకటన
YCP MLA Golla Baburao change his words after a short while

ఇటీవల ఏపీలో కొత్త మంత్రివర్గ కూర్పు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలను అసంతృప్తికి గురిచేసింది. మంత్రి పదవి దక్కుతుందని ఆశించి భంగపడిన కొందరు ఎమ్మెల్యేలు ఒకట్రెండు రోజులు సందడి చేసి ఆ తర్వాత సద్దుమణిగారు. అయితే, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కాస్త ఆలస్యంగానైనా అగ్గిమీద గుగ్గిలంలా వైసీపీ అధినాయకత్వంపై మండిపడ్డారు. అధిష్ఠానం తన నమ్మకంపై దెబ్బకొట్టిందని, తానేమీ అమాయకుడ్ని కాదని అంతకంతకు దెబ్బతీస్తానని భీకర ప్రతిజ్ఞ చేశారు. 

అయితే, ఏం జరిగిందో ఏమో కానీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అంతలోనే మాటమార్చారు. ఆ మాటలు ఎంతో ఆవేశంలో ఉన్నప్పుడు అన్నవని, అవి తన హృదయంలోంచి వచ్చినవి కావని చెప్పుకొచ్చారు. తానేమీ అధిష్ఠానానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని, అహింసా పంథాను వీడి నియోజకవర్గ ప్రజల కోసం దీటుగా స్పందిస్తానన్న వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. మంత్రి పదవి అంశంలో తనకెలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. 

తాను అనేక అవమానాలు ఎదుర్కొంటున్నా, వేదన అనుభవిస్తున్నా తగిన న్యాయం జరగలేదన్న భావన ఉందని స్పష్టం చేశారు. పాయకరావుపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

More Telugu News