CPI Ramakrishna: ఎన్నో ఫైళ్లు ఉండే కోర్టులో కాకాణి ఫైల్ మాత్రమే దొరికిందా?: సీపీఐ రామకృష్ణ

How thieves took only Kakani file asks CPI Ramakrishna
  • దొంగలు కాకాణి ఫైల్ మాత్రమే ఎలా ఎత్తుకెళ్లారన్న సీపీఐ నేత  
  • జిల్లా ఎస్పీ ఖాకీ డ్రెస్ వేసుకున్నారా? అనే అనుమానం కలుగుతోందంటూ కామెంట్ 
  • ఫైల్ దొంగతనంపై హైకోర్టుకు లేఖ రాస్తామన్న రామకృష్ణ 
నెల్లూరు కోర్టులో దొంగలు పడి... మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించిన ఫైలును ఎత్తుకుపోవడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కాకాణి ఫైల్ ను మాత్రమే దొంగలు ఎలా ఎత్తుకెళ్తారని ప్రశ్నించారు. ఎన్నో ఫైళ్లు ఉండే కోర్టులో కాకాణి ఫైల్ మాత్రమే దొంగలకు దొరికిందా? అని ఎద్దేవా చేశారు. స్క్రాప్ దొంగతనాలు చేసుకునే వారికి కాకాణి ఫైల్ దొంగతనం చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. 

జిల్లా ఎస్పీ అసలు ఖాకీ డ్రస్ వేసుకున్నారా? అనే అనుమానం కలుగుతోందని రామకృష్ణ అన్నారు. ఐపీఎస్ అధికారులు 'ఇంట్లో పోలీస్ సర్వీస్' అధికారులుగా మారిపోయారని విమర్శించారు. కోర్టులో ఫైల్ మాయంపై హైకోర్టుకు లేఖ రాస్తామని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రంతో కుమ్మక్కైన రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోక తప్పదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతోందని... ఇంతవరకు ఒక్క కాలువ నిర్మాణం కూడా పూర్తి చేయలేదని, ఒక్క ఎకరాకు కూడా నీటిని ఇవ్వలేదని దుయ్యబట్టారు. నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు ప్రాజెక్టులపై ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు.
CPI Ramakrishna
Kakani Govardhan Reddy
Court File

More Telugu News