Sri Lanka: శ్రీలంకలో నిరసనలు తీవ్రం.. వీధుల్లోకి మాజీ కెప్టెన్లు అర్జున రణతుంగ, జయసూర్య

  • శ్రీలంకలో రోజురోజుకు ముదురుతున్న సంక్షోభం
  • అధ్యక్షుడి రాజీనామాను డిమాండ్ చేస్తున్న ప్రజలు
  • రెండో వారానికి చేరుకున్న నిరసనలు
  • ఇతర క్రికెటర్లు వీధుల్లోకి రావాలని పిలుపు
Cricket Icons Jayasuriya Ranatunga Join Street Protests In Sri Lanka

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని దుర్భర పరిస్థితుల్లోకి వెళ్లిపోయిన శ్రీలంకలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్షకు వ్యతిరేకంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. రోజురోజుకు మరింత తీవ్రంగా మారుతున్నాయి. నిరసనకారులకు మద్దతుగా క్రికెటర్లు కూడా రోడ్డెక్కారు. శ్రీలంకకు ప్రపంచ కప్ అందించిన అర్జున రణతుంగతోపాటు మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య ఆందోళనల్లో పాలుపంచుకున్నారు. అధ్యక్ష భవనం ఎదుట నిన్న వేలాదిమంది నిరసన తెలిపారు. జయసూర్య బారికేడ్లు ఎక్కి మరీ నినాదాలు చేశాడు. 

ఈ సందర్భంగా జయసూర్య మాట్లాడుతూ.. ఈ నిరసనలు ఎందుకు జరుగుతున్నాయో అధికారులకు అర్థమయ్యే ఉంటుందని అన్నాడు. ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాగా, అధ్యక్షుడు గొటబాయ రాజీనామా కోసం జరుగుతున్న నిరసనలకు ఇతర క్రికెటర్లూ మద్దతు తెలపాలని అర్జున రణతుంగ, జయసూర్య కోరారు. వీధుల్లోకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. 

మాజీ క్రికెటర్, ఐసీసీ రెఫరీ రోషన్ మహానామా, మాజీ కెప్టెన్లు మహేల జయవర్ధనే, కుమార సంగక్కర వంటి వారు ఇప్పటికే అధ్యక్షుడి రాజీనామా కోసం జరుగుతున్న ఆందోళనలకు మద్దతు ప్రకటించారు. కాగా, అధ్యక్షుడి రాజీనామాను డిమాండ్ చేస్తూ మొదలైన నిరసనలు నిన్నటితో రెండో వారానికి చేరుకున్నాయి.

More Telugu News