Telangana: గవర్నర్​ తమిళిసైపై సీఎం కేసీఆర్​ సంచలన వ్యాఖ్యలు!

  • నిన్న కేబినెట్ భేటీలో ఆమె ప్రస్తావన
  • గవర్నర్ అత్యుత్సాహం చూపిస్తున్నారన్న సీఎం
  • ఆమెది వితండవాదమంటూ మంత్రులతో వ్యాఖ్య
CM KCR Sensational Comments On Governor Tamilisai

తెలంగాణ గవర్నర్ తమిళిసైపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. నిన్న కేబినెట్ భేటీ సందర్భంగా గవర్నర్ తీరుపై మంత్రులతో ఆయన చర్చించినట్టు సమాచారం. గవర్నర్ అత్యుత్సాహం చూపిస్తున్నారని ఆయన అన్నట్టు చెబుతున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసేలా గవర్నర్ ప్రవర్తిస్తున్నారని సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారని అంటున్నారు. చాలా అంశాలపై ఆమె వితండవాదం చేస్తున్నారని, ప్రభుత్వంతో ఏ మాత్రం సంబంధం లేదు అన్నట్టుగానే ఆమె వ్యవహారశైలి ఉందని కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. 

గత కొన్నాళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ తమిళిసైకి మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే. రాజ్ భవన్ లో గణతంత్ర వేడుకలకు సీఎం సహా ప్రభుత్వం దూరంగా ఉండడం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ లేకుండానే ప్రారంభించడం, ఆమె యాదాద్రికి వెళ్లినా ప్రొటోకాల్ పాటించకపోవడం వంటి ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె ఇటీవల ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర సర్కారు తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు.  

అసలు గవర్నర్, సర్కార్ మధ్య దూరం పెరగడానికి కారణం కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటును గవర్నర్ నిరాకరించడమేనన్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఢిల్లీ పర్యటనలోనూ గవర్నర్ తమిళిసై వెల్లడించారు కూడా. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రులతో గవర్నర్ తీరుపై సీఎం కేసీఆర్ మాట్లాడినట్టు చెబుతున్నారు.  

More Telugu News