Akbaruddin Owaisi: హిందూ దేవతలు, హిందువులపై అక్బరుద్దీన్ విద్వేషపూరిత వ్యాఖ్యల కేసు.. ఈరోజే తుది తీర్పు.. సర్వత్ర ఉత్కంఠ!

  • దశాబ్దం క్రితం హిందువులపై అక్బరుద్దీన్ విద్వేష ప్రసంగం చేశారంటూ ఆరోపణలు 
  • 15 నిమిషాలు టైమ్ ఇస్తే మేమేంటో చూపిస్తామని సవాల్
  • హిందూ దేవతలపై కూడా అనుచిత వ్యాఖ్యలు
Judgement on Akbaruddin Owaisi hate speech today

ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ పదేళ్ల క్రితం చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు అప్పట్లో పెను సంచలనాన్ని రేకెత్తించాయి. రెండు మతాల మధ్య చిచ్చు పెట్టాయి. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. దశాబ్ద కాలం పాటు కోర్టులో విచారణ కొనసాగింది. ఈరోజు ఈ కేసుకు సంబంధించి హైదరాబాదులోని నాంపల్లి కోర్టు తుది తీర్పును వెలువరించనుంది. కోర్టు ఎలాంటి తీర్పును ఇవ్వబోతుందనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. పైగా ఇది రంజాన్ మాసం కావడంతో... అక్బరుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా తీర్పు వస్తే శాంతిభద్రతల సమస్య కూడా తలెత్తే అవకాశం ఉందనే భయాందోళనలు నెలకొన్నాయి. 

కేసు వివరాల్లోకి వెళ్తే... దశాబ్దం క్రితం నిర్మల్ మున్సిపల్ గ్రౌండ్స్ లో అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంగిస్తూ.. 'మీరు 100 కోట్ల మంది. మేము కేవలం 25 కోట్ల మంది మాత్రమే. ఒక్క 15 నిమిషాలు మాకు అప్పగించండి. ఎవరు ఎక్కువో, ఎవరు తక్కువో చూపిస్తాం' అంటూ హిందువులపై విద్వేషాన్ని వెళ్లగక్కారు. 

ఈ ప్రసంగం ప్రకంపనలు రేపింది. దీంతో పాటు ఆదిలాబాద్ లో ఆయన మట్లాడుతూ నేరుగా హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఆయనపై ఐపీసీ 120-బీ, 153-ఏ, 295, 298, 188 సెక్షన్ల కింద పోలీసులు సుమోటోగా కేసులు పెట్టారు. అంతే కాదు... ఈ కేసులో ఒవైసీ ఇప్పటికే 40 రోజుల పాటు జైలు శిక్షను కూడా అనుభవించారు. 

ఒకవేళ ఈ కేసుల్లో అక్బరుద్దీన్ కు శిక్ష పడేట్టయితే... రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓల్డ్ సిటీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

More Telugu News