Telangana: భ‌ద్రాద్రి టూర్‌లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై.. ప్రొటోకాల్ ప్రకారం పోలీసు గౌర‌వ వంద‌నం

  • రైలులో కొత్త‌గూడెం చేరుకున్న గ‌వ‌ర్న‌ర్ దంప‌తులు
  • కొత్త‌గూడెంలోని సింగ‌రేణి గెస్ట్ హౌస్‌లో బ‌స‌
  • జిల్లాలోని త‌న ద‌త్త‌త గ్రామంలో ప‌ర్య‌ట‌న‌
  • ఆ త‌ర్వాత భ‌ద్రాచ‌లంలో రాములోరి ప‌ట్టాభిషేకానికి హాజ‌రు
ts governor tamilisai recived police salute at singareni guest house in kottagudem

భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరిన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల ప్రాంతంలో కొత్త‌గూడెం చేరుకున్నారు. ప‌తీ స‌మేతంగా భ‌ద్రాద్రి రాములోరి క‌ల్యాణానికి హాజ‌ర‌య్యేందుకు నేటి ఉద‌యం రైలు మార్గంలో హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరిన ఆమె కొత్త‌గూడెంలోని సింగ‌రేణి అతిథి గృహానికి చేరుకున్నారు.

ఈ సంద‌ర్భంగా అక్క‌డ పోలీసులు గ‌వ‌ర్న‌ర్‌కు పోలీసు వంద‌నం స‌మ‌ర్పించారు. తాను రాష్ట్రంలో ఎక్క‌డికి వెళ్లినా అధికారులు క‌నీసం ప్రొటోకాల్ కూడా పాటించ‌డం లేదంటూ ఇటీవలే గ‌వ‌ర్న‌ర్ ఆవేద‌న వ్యక్తం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే సోమ‌వారం ఆమె కొత్తగూడెంలోని సింగ‌రేణి అతిథి గృహం చేరుకున్న స‌మ‌యంలో ప్రొటోకాల్ నిబంధ‌న‌ల మేర‌కు ఆమెకు పోలీసుల గౌరవ వంద‌నం ద‌క్క‌డం గ‌మ‌నార్హం. 

ఇదిలా ఉంటే మ‌రికాసేప‌ట్లోనే ఆమె జిల్లాలో తాను ద‌త్త‌త తీసుకున్న గ్రామం అశ్వారావుపేట నియోజకవర్గం ధమ్మపేట మండలం పూసుకుంట గ్రామ పంచాయతీకి చేరుకుంటారు. అక్క‌డ ఆమె గ్రామ పెద్ద‌లు, గ్రామంలోని కొండ‌రెడ్ల‌తో భేటీ కానున్నారు. ఆ త‌ర్వాత ఆమె భ‌ద్రాచ‌లం వెళ్లి.. అక్క‌డ జ‌ర‌గ‌నున్న రాములవారి ప‌ట్టాభిషేకంలో పాలుపంచుకుంటారు.

More Telugu News