Talasani: గవర్నర్లు వారి పరిమితులకు లోబడి మాట్లాడాలి: మంత్రి తలసాని

  • గవర్నర్లు మీడియాతో రాజకీయాలు మాట్లాడరాదన్న తలసాని
  • అసలు గవర్నర్ వ్యవస్థే వద్దన్న డిమాండ్ ఉందన్న మంత్రి  
  • తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని వెల్లడి 
Talasani responds to Governor issue

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై టీఆర్ఎస్ మంత్రుల ఎదురుదాడి కొనసాగుతోంది. తాజాగా ఈ అంశంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. గవర్నర్లు వారి పరిమితులను గుర్తెరిగి మాట్లాడాలని హితవు పలికారు. గవర్నర్ ల పరిధిపై రాజ్యాంగం స్పష్టంగా పేర్కొందని అన్నారు. అసలు, గవర్నర్ వ్యవస్థే వద్దని చాలాకాలం నుంచి డిమాండ్ ఉందని వెల్లడించారు. 

కేంద్రం పెద్దలను కలిసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. తెలంగాణలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉందని, గవర్నర్ ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. ఎలాంటి తప్పిదాలు జరగనప్పుడు అనవసరంగా విమర్శలు చేయడమేంటని తలసాని అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్లను గౌరవించడం ఎలాగో సీఎం కేసీఆర్ కు, తమకు తెలుసని తలసాని స్పష్టం చేశారు. గవర్నర్లు మీడియాతో రాజకీయాలు మాట్లాడతారా? అంటూ ప్రశ్నించారు.

More Telugu News