Mutual Transfers: ఉద్యోగుల పరస్పర బదిలీలకు దరఖాస్తులు కోరుతున్న తెలంగాణ సర్కారు

  • మ్యూచువల్ ట్రాన్సఫర్లకు దరఖాస్తులు
  • ఈ నెల 15న తుది గడువు
  • ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు
  • ఇప్పటివరకు 31 దరఖాస్తులు వచ్చాయన్న సీఎస్
Telangana govt invites applications for mutual transfers

తెలంగాణలో ఉద్యోగుల పరస్పర బదిలీల (మ్యూచువల్) ప్రక్రియ షురూ అయింది. పరస్పర బదిలీలు కోరుకునే ఉద్యోగులు ఈ నెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. ఈ బదిలీలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో సీనియారిటీ ప్రొటెక్షన్ కల్పించనున్నట్టు తెలిపారు.

మ్యూచువల్ బదిలీల మార్గదర్శకాలను జీవో నెం.21లో పొందుపరిచామని, ఈ జీవో ఫిబ్రవరి 2న విడుదలైందని వివరించారు. అయితే, ఈ జీవోలోని 7వ, 8వ పేరాల్లో పేర్కొన్న నిబంధనలను ప్రభుత్వం సవరించిందని, దానిపై జీవో నెం.402ను ఫిబ్రవరి 19న తీసుకువచ్చిందని సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. 

మార్పులు చేసిన అనంతరం... ఉమ్మడి జిల్లా క్యాడర్ కు చెందిన ఇద్దరు ఉద్యోగులు పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకుంటే, వారి సీనియారిటీకి కొత్త లోకల్ క్యాడర్ లోనూ ప్రొటెక్షన్ ఉంటుందని స్పష్టం చేశారు. 

పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకునే ఉద్యోగులు ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా ఈ నెల 15 లోగా వివరాలు సమర్పించాలని వెల్లడించారు. ఇప్పటిదాకా మ్యూచువల్ బదిలీ కోరుతూ 31 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

More Telugu News