Marco Jansen: చాకులాంటి కుర్రాడ్ని కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్

  • ఐపీఎల్ వేలంలో రెండో రోజు
  • మార్కో జాన్సెన్ ను సొంతం చేసుకున్న సన్ రైజర్స్
  • ఇటీవలే అంతర్జాతీయ అరంగేట్రం
  •  విశేషంగా రాణిస్తున్న జాన్సెన్
Sunrisers Hyderabad bought Marco Jansen

ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో సన్ రైజర్స్ హైదరాబాదు ఎంతో ఆచితూచి వ్యవహరిస్తుంది. కాగా, బెంగళూరులో నేడు వేలం ప్రక్రియ రెండోరోజుకు చేరింది. ఇవాళ్టి వేలంలో సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఓ నికార్సయిన ఆటగాడ్ని కొనుగోలు చేసింది. ఇటీవల కాలంలో దక్షిణాఫ్రికా జట్టులో సంచలన ప్రదర్శనలు నమోదు చేస్తున్న కుర్ర ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ ను వేలంలో సన్ రైజర్స్ చేజిక్కించుకుంది. మార్కో జాన్సెన్ ను సన్ రైజర్స్ రూ.4.2 కోట్లతో కొనుగోలు చేసింది.

జాన్సెన్ వయసు 21 ఏళ్లు. ఎడమచేతివాటం పేస్ బౌలింగ్, కుడిచేతివాటం బ్యాటింగ్ తో జాన్సెన్ ఇటీవల టీమిండియాపై అద్భుత ప్రదర్శన చేశాడు. సొంతగడ్డపై టీమిండియాను టెస్టు సిరీస్ లో ఓడించడంలో జాన్సెన్ కీలకపాత్ర పోషించాడు. భారత్ పైనే ఆరంగేట్రం చేసిన ఈ పొడగరి 3 టెస్టుల్లో 19 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. బ్యాటింగ్ లోనూ ఎంతో ధాటిగా ఆడగలగడం జాన్సెన్ ప్రత్యేకత. అందుకే ఐపీఎల్ లో సన్ రైజర్స్ రూ.4 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసింది.

ఇక నేటి వేలంలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టన్ కోసం ఫ్రాంచైజీలు భారీగా పోటీపడ్డాయి. చివరికి లివింగ్ స్టన్ ను పంజాబ్ కింగ్స్ రూ.11.50 కోట్లకు కైవసం చేసుకుంది. లివింగ్ స్టన్ స్పెషాలిటీ దూకుడుగా ఆడడమే. గణాంకాలు ఏమంత మెరుగ్గా లేకపోయినా, వేగంగా ఆడే స్వభావం, పైగా లెగ్ స్పిన్నర్ కావడం వేలంలో కలిసొచ్చింది.

వెస్టిండీస్ కొత్త ఆల్ రౌండర్ ఒడియన్ స్మిత్ కు కూడా నేటి వేలంలో భారీ ధర పలికింది. స్మిత్ ను రూ.6 కోట్లతో పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.

నేటి వేలంలో ఇతర కొనుగోళ్లు...

  • శివమ్ దూబే- రూ.4 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
  • ఐడెన్ మార్ క్రమ్- రూ.2.6 కోట్లు (సన్ రైజర్స్ హైదరాబాద్)
  • జయంత్ యాదవ్- రూ.1.70 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
  • విజయ్ శంకర్- రూ.1.40 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
  • డొమినిక్ డ్రేక్స్- రూ.1.10 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
  • మన్ దీప్ సింగ్- రూ.1.10 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
  • అజింక్యా రహానే- రూ.1 కోటి (కోల్ కతా నైట్ రైడర్స్)

  • Loading...

More Telugu News