Suman Toor: సిద్ధూ తల్లిని కూడా పట్టించుకోని క్రూరుడు... తీవ్ర ఆరోపణలు చేసిన సోదరి!

  • తాను సిద్ధూ సోదరిని అంటున్న సుమన్ తూర్
  • తమ తండ్రి 1986లో చనిపోయాడని వెల్లడి
  • ఆ తర్వాత తల్లిని సిద్ధూ నిరాదరణకు గురిచేశాడని ఆరోపణ
  • ఢిల్లీలో అనాథలా మరణించిందని వ్యాఖ్యలు
Suman Toor sensational allegations on Navjot Singh Sidhu

మరికొన్ని రోజుల్లో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అనుకోని రీతిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తనను తాను సిద్ధూ సోదరిగా చెప్పుకుంటున్న సుమన్ తూర్ అనే మహిళ స్పందిస్తూ, వృద్ధురాలైన తల్లిని సిద్ధూ ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. సిద్ధూ ఎంతో క్రూరమైన వ్యక్తి అని పేర్కొన్నారు. సుమన్ తూర్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు.

"మా తండ్రి 1986లో మరణించారు. అప్పటినుంచి మా అమ్మను సిద్ధూ గాలికొదిలేశారు. ఆమె 1989లో ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఓ అనాథలా మరణించింది" అని సుమన్ తూర్ వివరించారు. సిద్ధూ ప్రతి అంశాన్ని డబ్బుతో ముడిపెడుతుంటాడని విమర్శించారు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో సిద్ధూ తన తల్లిదండ్రుల విషయంలో చెప్పింది అబద్ధమని తూర్ అన్నారు. తన రెండేళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడిపోయారని సిద్ధు చెప్పినదాంట్లో నిజంలేదని పేర్కొన్నారు. సిద్ధూ సోదరిగా చెప్పుకుంటున్న సుమన్ తూర్ ఆరోపణలు పంజాబ్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. వీటిపై సిద్ధూ ఇంకా స్పందించలేదు.

More Telugu News